
సూపర్స్టార్ రజనీకాంత్ ( Rajinikanth) ప్రస్తుతం 'జైలర్ 2'తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత చేయనున్న తన 173వ సినిమా (Thalaivar 173) విషయంలో కూడా ఆయన ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ సినిమా దర్శకుడి విషయంలో జరుగుతున్న సస్పెన్స్కు ఎట్టకేలకు తెరపడింది.
మొదట ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మాణంలో, సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. కానీ, ఏవో కారణాల వల్ల సుందర్ సి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత శిబి చక్రవర్తిను దర్శకుడిగా ప్రకటించారు. ఇటీవల మళ్ళీ దర్శకుడు మారాడు అంటూ అనూహ్యంగా 'డ్రాగన్' ఫేమ్ అశ్వత్ మారిముత్తు పేరు తెరపైకి వచ్చింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించే బాధ్యతను శిబి చక్రవర్తికే అప్పగించినట్లు సమాచారం. అంటే ఈ ప్రాజెక్ట్ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ శిబి చక్రవర్తి చేతికే వచ్చింది అన్నమాట.
శిబి చక్రవర్తి గతంలో 'డాన్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రజనీకాంత్ ఇమేజ్కు తగ్గట్టుగా ఒక పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను ఆయన సిద్ధం చేశారట. ఇప్పటికే రజనీకాంత్ కోసం దాదాపు 80కి పైగా విభిన్నమైన గెటప్స్, లుక్ టెస్టులు కూడా జరిగినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇటీవల బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన 'ధురంధర్' తరహాలో సరికొత్త మాస్ ఫార్ములాతో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పనులు చకచకా జరుగుతున్నప్పటికీ, డైరెక్టర్ ఎవరనే దానిపై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం రజనీకాంత్ 'జైలర్ 2' (Jailer 2) పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 'జైలర్ 2' విడుదల సమయానికి 'తలైవర్ 173'పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశముంది.






