తెలుగు సినీ డాన్స్ కొరియోగ్రఫీ రంగానికి చెందిన ప్రముఖ డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొద్దిరోజులుగా నడుస్తున్న వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సమయానికి గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుగొట్టి ఆమెను కాపాడటంతో తృప్తిలో ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళితే.. కొరియోగ్రాఫర్ ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి ఇన్ని రోజులవుతున్నా పోలీసులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, అరెస్ట్ చేయకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మనస్తాపంతోనే ఆమె ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు.
వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు మాధురిని రక్షించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. అయితే, ఈశ్వర్ సాయిపై ఇచ్చిన ఫిర్యాదు విషయంలో నార్సింగి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అతడిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ మాధురి రాథోడ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్లుగా గుర్తింపు పొందే క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, ఆ తర్వాత వివాదాలకు దారితీసింది. గతంలో కూడా పలువురు డ్యాన్సర్లు, ఆర్టిస్టులు ఎదుర్కొన్న ఇటువంటి ఘటనలపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడిచింది. అయితే న్యాయం జరగడం లేదన్న ఆవేదనతోనే మాధురి ఈ రీతిలో స్పందించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ఈ ఘటనతో సినీ వర్గాలు, సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. బాధితురాలి ఆరోపణలపై నార్సింగి పోలీసులు స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణను వేగవంతం చేశారు.
[Dancer Madhuri Rathod, Ishwar Sai, Madhuri Rathod Suicide Attempt, Narsingi Police Station, Telugu Cinema Gossip]




