Home

»

Latest News

VIjay: విజయ్, ఉదయనిధి కలిసి గెలిచారు.. తెరపైకి వచ్చిన సరికొత్త విజయం  

Jun 18, 2026 11:31AM

 

 ఏళ్ళ తరబడి రాజకీయాలని శాసిస్తున్న వాళ్ళు సినిమాకి ఉన్న పవర్ ముందు తలొగ్గాల్సిందే అని మరో సారి నిరూపించారు  ఇళయ దళపతి విజయ్, స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్. ప్రెజెంట్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండగా, ఉదయనిధి ఏంఎల్ఏ తో పాటు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు.  


ఎన్నికల నామినేషన్ల సమయంలో వీరు సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తుల వివరాలని  తప్పుగా చూపించారని, దీనిపై ఆదాయపు పన్ను శాఖ మరియు ఎన్నికల సంఘంతో సమగ్ర విచారణ జరిపించాలని దాఖలైన ప్రజాహిత పిటిషన్లను మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. ధర్మాధికారి, జస్టిస్ జి. అరుల్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం పూర్తిగా కొట్టివేసింది. ఈ తీర్పుతో ఆ ఇద్దరికీ పెద్ద ఉపశమనం లభించినట్లయింది. ఈ వివాదం నేపథ్యాన్ని పరిశీలిస్తే, ముఖ్యమంత్రి విజయ్ పెరంబూర్ ,తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుండి పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన నామినేషన్లలో ఆస్తుల వివరాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని పెరంబూర్ ఓటరు విఘ్నేష్ కోర్టుని ఆశ్రయించాడు . ఒక నియోజకవర్గంలో 115 కోట్లుగా చూపిన ఆస్తులను, మరో నియోజకవర్గంలో  220 కోట్లుగా పేర్కొన్నారని పిటిషనర్ ఆరోపించారు. అయితే, విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది నిరంజన్ రాజగోపాలన్ కోర్టుకు కీలక వివరణ ఇస్తూ, విజయ్ ఇప్పటికే పెరంబూర్ నియోజకవర్గానికి సంబంధించి సవరించిన నామినేషన్ పత్రాలను సమర్పించారని, రెండు చోట్లా ప్రకటించిన ఆస్తి విలువలు సరైనవేనని స్పష్టం చేశారు. దీంతో ఈ ఆరోపణల్లో పస లేదని తేలిపోయింది.

మరోవైపు, చేపాక్కం ట్రిప్లికేన్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్‌పై కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. 2021 ఎన్నికల అఫిడవిట్‌తో పోలిస్తే 2026 ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తుల వివరాలను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని కుమారవేల్ అనే ఓటరు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఉదయనిధి స్టాలిన్ 2021 ఎన్నికల్లో రూ. 21,13,09,650 విలువైన చరాస్తులు, 6,54,39,552 విలువైన స్థిరాస్తులను ప్రకటించగా, 2026 అఫిడవిట్‌లో ఆయనకు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థకు సంబంధించిన  7,36,51,294 పెట్టుబడి వివరాలను దాచేశారని ఆదాయపు పన్ను శాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. అదేవిధంగా మైలాపూర్ బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ 2024 లోక్‌సభ ఎన్నికల వివరాలకు, ప్రస్తుత ఎన్నికల వివరాలకు పొంతన లేదంటూ గౌతమ్ శివ అనే ఓటరు మరో కేసు వేశారు.

Also read: Prakash Raj: ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు..ఒక్కసారి కూడా ఆ గుడికి వెళ్ళలేదు 

ఈ వాదనలన్నింటినీ విన్న హైకోర్టు ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం ఇటువంటి విషయాల్లో నేరుగా ఆదాయపు పన్ను శాఖ విచారణకు ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. అఫిడవిట్లలో సమాచారాన్ని దాచడం లేదా తప్పుగా చూపించడం అనేది ఎన్నికలను సవాలు చేయడానికి బలమైన కారణం కావచ్చు, కానీ దానికి సరైన మార్గం కేవలం 'ఎన్నికల పిటిషన్' దాఖలు చేయడం మాత్రమేనని న్యాయమూర్తులు గుర్తుచేశారు.  


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com