జగన్-చిరు లంచ్ మీట్.. టికెట్ల లెక్క తేలుతుందా?
on Jan 13, 2022
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి మధ్యాహ్నం భేటీ అవుతున్నారు. ఈ మేరకు చిరంజీవికి సీఎం నుంచి అపాయింట్మెంట్ ఖరారైంది. జగన్, చిరంజీవి కలిసి లంచ్ చేస్తారని సమాచారం. ఏపీలో సినిమా టికెట్ ధరలతో పాటు తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలను సీఎం జగన్ తో చిరంజీవి చర్చిస్తారని తాజాగా అందుతున్న సమాచారం. వీరిద్దరి భేటీతో సినిమా టికెట్ లెక్కలు ఓ కొలిక్కి వస్తాయని టాలీవుడ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Also read: ఎవరికి బలిసింది.. మీ ఎమ్మెల్యేలు ఎంత తిన్నారో బహిరంగ చర్చకు సిద్ధమా?
దేశంలో ఎక్కడా లేని విధంగా కొన్ని రోజులుగా ఏపీలో సినిమా టికెట్ ధరలతో పాటు థియేటర్ల వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ- ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని మధ్య ఓ రేంజ్ లో ట్వీట్ల యుద్ధం జరిగింది. ఆ తర్వాత కాస్త చల్లబడి ఇద్దరూ నేరుగా అమరావతి సెక్రటేరియట్ లో చర్చలు కూడా జరిపారు. వర్మ ఇండస్ట్రీ ప్రతినిధిగా నానిని కలవలేదనీ, వ్యక్తిగతంగానే ఆయన కలిశారనీ టాలీవుడ్ వర్గాలు చెప్పాయి. ఏదేమైనా వర్మ-నాని భేటీ వల్ల ఇండస్ట్రీకి ఒరిగింది నయాపైసా కూడా లేదు. టాలీవుడ్ పెద్దలు- నిర్మాతలు, హీరోలు ఏపీ ప్రభుత్వ నేతల మధ్య పలుమార్లు కీలక సమావేశాలు కూడా జరిగాయి. అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీ సమస్యలు పరిష్కారం కాలేదు.
Also read: అందుకే సినిమా టికెట్ ధరల తగ్గింపుతో మాకు ఇబ్బంది లేదు!
రోజు రోజుకూ ముదిరిపోతున్న సినిమా టికెట్ల వ్యవహారంపై జగన్తో మెగాస్టార్ చిరంజీవి చర్చించనున్నారు. అలాగే చిత్రపరిశ్రమకు సంబంధించిన ఇతర సమస్యలు, ఏపీలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి లాంటి కీలక అంశాలపై ఈ లంచ్ భేటీలో సీఎం జగన్ తో చర్చిస్తారని సమాచారం. సీఎంతో చర్చల ద్వారా టికెట్ ధరల సమస్యకు చిరంజీవి ఫుల్స్టాప్ పెట్టగలరని పలువురు భావిస్తున్నారు. సినిమా టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని సీఎంను చిరంజీవి కోరనున్నారు. దీంతో సీఎం జగన్ తో చిరంజీవి భేటీ అవుతుండడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
Also Read