
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ప్రస్తుతం తన 158 వ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ(bobby)దర్శకుడు కావడంతో సదరు 158 వ చిత్రంపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
నిన్న హైదరాబాద్ లోని గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన క్రీడల పోటీలకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)తో కలిసి చిరంజీవి హాజరయ్యారు. దీంతో సదరు వేదిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) సీజన్-2 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మెగాస్టార్ హాజరయ్యారు. ఒకే వేదికపై రాజకీయ, సినీ రంగాల అగ్రనేతలు కలిసి కూర్చొని రగ్బీ ఆటను ఆసక్తిగా వీక్షించడం అక్కడ ఉన్న క్రీడాభిమానులని ఎంతగానో అలరించింది.
ఈ అద్భుతమైన ఫైనల్ మ్యాచ్లో హోరాహోరీ పోరు సాగింది. గత ఏడాది తృటిలో టైటిల్ చేజార్చుకుని రన్నరప్గా నిలిచిన హోమ్ టీమ్ హైదరాబాద్ హీరోస్ ఈసారి మాత్రం పట్టు వదలకుండా సింహ గర్జన చేసింది. మైదానంలో పక్కా వ్యూహాలు, అద్భుతమైన డిఫెన్స్తో ముంబై డ్రీమర్స్ జట్టును ఉక్కిరిబిక్కిరి చేసింది. మ్యాచ్ ముగిసేసరికి హైదరాబాద్ హీరోస్ 41-17 పాయింట్ల తేడాతో ముంబై డ్రీమర్స్పై ఘన విజయం సాధించి, సరికొత్త రగ్బీ ఛాంపియన్గా అవతరించింది.
టోర్నీ ముగిసిన అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి విజేత హైదరాబాద్ హీరోస్ జట్టుకి ఛాంపియన్షిప్ ట్రోఫీని అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు, నటి మృణాల్ ఠాకూర్, రగ్బీ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ బోస్ చేతుల మీదుగా రన్నరప్గా నిలిచిన ముంబై జట్టుకు, ఇతర క్రీడాకారులకి పతకాలని ప్రదానం చేశారు. జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక లీగ్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టుకు ఏకంగా . 45 లక్షల భారీ ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్గా నిలిచిన ముంబై డ్రీమర్స్ జట్టు రూ. 25 లక్షలు గెలుచుకోగా, మూడో స్థానం కోసం జరిగిన ప్లే-ఆఫ్ పోరులో చెన్నై బుల్స్పై 22-19తో గెలిచిన బెంగళూరు బ్రేవ్హార్ట్స్ జట్టు రూ. 15 లక్షల నగదు బహుమతిని సొంతం చేసుకుంది.






