
-ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఇంట్లో విషాదం
-టిఫిన్ చేస్తుండగా హఠాన్మరణం
-అన్నమయ్య జిల్లా కలికిరిలో ఘటన
గేయ రచయితగా తెలుగు సినిమా పాటని ఆస్కార్ వేదికపై ఉంచిన సాహిత్య చక్రవర్తి చంద్రబోస్(Chandrabose). నిత్యం పాటకి పట్టాభిషేకం కట్టే పనిలో ఉండే చంద్రబోస్ ఇప్పుడు విషాద వదనంతో మునిగిపోయారు.
ఆయన సోదరుడు రాజేంద్ర నిన్న ఉదయం ఏపిలోని అన్నమయ్య జిల్లా కలికిరిలో గుండెపోటుతో మరణించారు. శనివారం రోజే ఆయన కలికిరికి వచ్చి తన స్నేహితుడు శ్రీనివాస్ నివాసంలో బస చేశారు. ఆదివారం ఉదయం స్వల్ప అస్వస్థతకి గురవ్వడంతో సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స కూడా తీసుకోవడం జరిగింది. అనంతరం సమీపంలోని హోటల్లో టిఫిన్ చేస్తుండగా ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. రాజేంద్ర మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు చంద్రబోస్కు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
ఇక ఈ ఘటనతో చంద్రబోస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వృత్తిరీత్యా రాజేంద్ర బెంగళూరులో స్థిరపడ్డారు. పూర్తి పేరు కనుకుంట్ల రాజేంద్ర.
.webp)






