'సిరివెన్నెల'తో చివరిసారిగా మాట్లాడిన వ్యక్తిని నేనే!
on Dec 1, 2021
లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి కడసారి చూపుకోసం సినీ రాజకీయ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ కు తరలి వచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ఏపీ మంత్రి పేర్ని నాని, తెలంగాణ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు సిరివెన్నెల భౌతికకాయానికి నివాళులర్పించారు.
చిరంజీవి మాట్లాడుతూ.. "చాలా దురదృష్టకరం. ఆయనతో చివరిసారిగా మాట్లాడిన వ్యక్తిని నేనే. అది నా అదృష్టం. ఆయన ఆసుపత్రిలో చేరినప్పుడు మంచి చికిత్స కోసం చెన్నై తీసుకెళ్తానని చెప్పాను. ఆరోజు ఫోన్ లో చాలాసేపు మాట్లాడుకున్నాం. ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. మంచి మిత్రుడిని కోల్పోయా. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు." అన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ.. "తెలుగు భాషకు, సాహిత్యానికి ఆభరణం లాంటి వ్యక్తి సిరివెన్నెల. నేను నటించిన 'జననీ జన్మభూమి' సినిమాతో ఆయన సినీరంగ ప్రవేశం చేయడం నా పూర్వజన్మ సుకృతం. ఇద్దరం కలిసినప్పుడు సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తిని పొందేవాడిని" అన్నారు.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "కొన్ని కొన్ని సార్లు మన ఆవేదనను, భాదను వ్యక్తపరచడానికి మాటలు రావు. అలాంటి భావాలను ఆ మహానుభావుడు తన కలంతో వ్యక్తపరిచారు. బహుశా ఈ ఆవేదనను ఆయన తన కలంతోనే వ్యక్తపరిస్తే బావుండేది. సీతారామ శాస్త్రి గారు రాసిన ఎన్నో అద్భుతమైన పాటలు, అక్షరాలు.. తెలుగు జాతి, తెలుగు భాష బ్రతికున్నంతకాలం చిరస్మరణీయంగా ఉంటాయి" అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. "శాస్త్రి గారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నా కుటుంబ సభ్యుల తర్వాత నేను కాళ్లకు నమస్కారం చేసే అతి తక్కువ మంది వ్యక్తుల్లో సిరివెన్నెల ఒకరు:" అన్నారు.
వెంకటేష్ మాట్లాడుతూ.. " సాహిత్యంలో మనం ఒక లెజెండ్ ని కోల్పోయాం" అన్నారు.
మహేష్ మాట్లాడుతూ.. "సిరివెన్నెల లేకుండా తెలుగు సినిమా పాటలు ఉండబోతున్నాయనేది ఊహించడానికే కష్టంగా ఉంది." అన్నారు.
పవన్ మాట్లాడుతూ.. "సీతారామ శాస్త్రి గారి మరణం చాలా బాధ కలిగించింది. కొన్ని దశాబ్దాలు ఉండి తెలుగు చిత్ర పరిశ్రమకు సేవ చేయాల్సిన వ్యక్తి కన్నుమూయడం దురదృష్టకరం" అన్నారు.
హరీష్ రావు మాట్లాడుతూ.. "సీతారామ శాస్త్రి గారి మరణం తెలుగు సినీ పరిశ్రమకు, సాహిత్య రంగానికి తీరని లోటు" అన్నారు.
Also Read