Home

»

Latest News

సింగిల్ స్క్రీన్ థియేటర్ల‌పై ఏషియన్ సునీల్ నారంగ్ సంచలన వ్యాఖ్యలు!

May 18, 2026

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య థియేటర్ల రెంటల్స్, పర్సంటేజ్ షేరింగ్ అంశంపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పంపిణీదారుడు, ఎగ్జిబిటర్ మరియు నిర్మాత అయిన ఏషియన్ సునీల్ నారంగ్ తెలుగు చలనచిత్ర రంగానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులను వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్స్ మనుగడ సాధించాలంటే పాత పద్ధతులను పక్కనబెట్టి కొత్త విధానాన్ని అవలంబించక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని సునీల్ నారంగ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కలెక్షన్లలో నిర్దిష్ట వాటా ఇచ్చే పర్సంటేజీ విధానం ఎప్పుడో అమల్లోకి వచ్చినప్పటికీ, మన దగ్గర ఇంకా పాత అద్దె పద్ధతులే నడుస్తున్నాయని గుర్తు చేశారు. దీనివల్ల కరెంట్ బిల్లులు, థియేటర్ నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతాలు కూడా రావడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే మెజారిటీ థియేటర్లు మూతపడక తప్పదని హెచ్చరించారు.

మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్ స్క్రీన్స్‌కు కూడా నెట్ కలెక్షన్లపై 50-50 బేసిస్ షేరింగ్ లేదా సమాన వాటా ఇచ్చే పర్సంటేజీ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో థియేటర్లలో లభించే ఫుడ్ & బెవరేజెస్ (క్యాంటీన్ ఆదాయం), పార్కింగ్ ఫీజుల నుంచి వచ్చే ఆదాయాన్ని నిర్మాతలతో పంచుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేవలం క్యాంటీన్, పార్కింగ్ వల్ల వచ్చే అదనపు ఆదాయం తోనే ప్రస్తుతం సింగిల్ స్క్రీన్స్ నెట్టుకొస్తున్నాయని ఆయన ప్రాక్టికల్‌గా వివరించారు.

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కేవలం థియేటర్ యాజమాన్యం తమ సొంత పెట్టుబడితో కల్పించే మౌలిక వసతుల ద్వారా ఈ అదనపు ఆదాయం వస్తుందని సునీల్ నారంగ్ కుండబద్దలు కొట్టారు. నిర్మాతలు క్యాంటీన్ ఆదాయంలో వాటా అడిగితే.. మరి థియేటర్ల డిజిటల్ ప్రొజెక్షన్ కోసం ఎగ్జిబిటర్లు భరిస్తున్న వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) చార్జీలను లేదా రోజువారీ మెయింటెనెన్స్ ఖర్చులను నిర్మాతలు పంచుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.

ప్రస్తుతం ఈ థియేటర్ల రెంటల్స్ వివాదం టాలీవుడ్ సర్కిల్స్‌లో పెను దుమారం రేపుతోంది. సోషల్ మీడియాలో సైతం సినీ అభిమానులు, విశ్లేషకులు ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా, చిన్న చిత్రాలు ఆడినప్పుడు కూడా థియేటర్లకు నష్టాలు రాకుండా చూడాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఏదేమైనా, టాలీవుడ్ మనుగడకు ఎంతో కీలకమైన ఈ సమస్యలన్నింటినీ తెలుగు ఫిలిం ఛాంబర్ వేదికగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఒకేతాటిపైకి వచ్చి సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి. త్వరలోనే ఈ వివాదానికి ఒక ముగింపు దొరుకుతుందని, ఇరు వర్గాలకు న్యాయం జరిగేలా కొత్త గైడ్‌లైన్స్ వస్తాయని అంతా ఆశిస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com