దక్షిణాది చిత్ర పరిశ్రమలో 'యాక్షన్ కింగ్'గా తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ హీరో, దర్శకుడు అర్జున్ సర్జా తాజాగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారారు. సినిమాల విజయాలను చూపించుకోవడానికి ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న ఫేక్ కలెక్షన్ల సంస్కృతిపై ఆయన ముక్కుసూటిగా స్పందించారు. తన నైతిక విలువలను పణంగా పెట్టి అబద్ధపు ప్రచారాలు చేయనని స్పష్టం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
అర్జున్ సర్జా స్వయంగా దర్శకత్వం వహిస్తూ, తన సొంత నిర్మాణ సంస్థ 'శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' బ్యానర్పై 'సీతా పయనం' అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఎమోషనల్ రోడ్ రొమాంటిక్ డ్రామాతో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్కు కథానాయికగా పరిచయం కాగా, నిరంజన్ సుధీంద్ర హీరోగా నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి ఫీల్-గుడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లను సాధించలేకపోయింది.
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ రన్ సమయంలో ప్రమోషన్ల బాధ్యతలు చూసుకునే ఒక మార్కెటింగ్ ఏజెన్సీ అర్జున్ను కలిసి ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన పెట్టింది. సినిమా విడుదలై నాలుగు రోజులు దాటిన నేపథ్యంలో.. ఈ చిత్రం ఏకంగా రూ. 4 కోట్లు వసూలు చేసినట్లు ఒక కలెక్షన్ పోస్టర్ను అధికారికంగా విడుదల చేద్దామని వారు సలహా ఇచ్చారు. దీనివల్ల మార్కెట్లో సినిమాపై హైప్ పెరుగుతుందని వారు నమ్మబలికారు.
కానీ ఆ ఏజెన్సీ ఐడియా వినగానే అర్జున్ తీవ్రంగా మండిపడ్డారు. తనకు రాని సొమ్మును వచ్చినట్లుగా చూపిస్తూ, కేవలం పబ్లిసిటీ కోసం అబద్ధపు వసూళ్లతో కూడిన ఫేక్ పోస్టర్లను వేసే ప్రసక్తే లేదని ముక్కుసూటిగా తిరస్కరించారు. మన సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంతో అందరికీ తెలుసని, మోసపూరిత ప్రచారాలతో ప్రేక్షకులను తప్పుదోవ పట్టించలేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ మీడియా వేదికగా పంచుకోవడంతో నెటిజన్లు ఆయన నిజాయితీకి ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్జున్ తీసుకున్న స్టాండ్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతీ సినిమాకు వందల కోట్ల ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు వేస్తూ మైలేజ్ పెంచుకోవాలని చూస్తుంటే, ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకున్న అర్జున్ నిజమైన 'కింగ్' అని సినీ విశ్లేషకులు సైతం కొనియాడుతున్నారు. తప్పుడు ప్రచారాలకు తావివ్వకుండా విలువలను కాపాడే ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు నటుడిగా అర్జున్ సర్జా ఖాతాలో ప్రస్తుతం మరో భారీ విజయం చేరింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ 'బ్లాస్ట్ జోన్' (Blast Zone) మే 28న విడుదలై థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సుభాష్ కె. రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో 'అర్జున్ సర్కార్'గా ఆయన చేసిన యాక్షన్ విన్యాసాలు మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడిగా తన కుమార్తె సినిమాకు ఆశించిన విజయం దక్కకపోయినా, నటుడిగా 'బ్లాస్ట్ జోన్'తో అర్జున్ బాక్సాఫీస్ వద్ద మళ్లీ తన పవర్ ఏంటో నిరూపిస్తున్నారు.
ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, కేవలం ₹7 కోట్ల బడ్జెట్తో రూపొందిన ‘బ్లాస్ట్ జోన్’ తొలి ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.28 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇందులో ఇండియా వైడ్గానే దాదాపు రూ.19.4 కోట్ల గ్రాస్ నమోదైంది. కేవలం మొదటి వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 21.58 కోట్ల నుండి రూ.25 కోట్ల రేంజ్లో గ్రాస్ వసూలు చేసి ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. ఓవర్సీస్ మార్కెట్లో ఊహించని విధంగా రూ.5.55 కోట్లు కొల్లగొట్టడం విశేషం. ప్రస్తుత రన్ను బట్టి చూస్తే ఈ చిత్రం లాంగ్ రన్లో సులభంగా రూ.50 కోట్ల క్లబ్లో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.






