ENGLISH | TELUGU  

చిరంజీవి, నేను బంధుత్వానికి బావామరుదులం, ఆత్మీయతకు అన్నదమ్ములం!

on Dec 26, 2019

 

సాయితేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన 'ప్రతిరోజూ పండగే' మూవీ డిసెంబర్ 20న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా విజయోత్సవం రాజమండ్రిలో కన్నులపండుగగా జరిగింది. ఇందులో మాట్లాడిన అరవింద్ ఒక సందర్భంలో సాయితేజ్ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

"నేను ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉండి గీతా ఆర్ట్స్‌పై కాన్సన్‌ట్రేషన్ తగ్గుతుందనుకొనే టైంలో బన్నీ వాసు వచ్చి గీతా ఆర్ట్స్‌కు హెల్ప్ చేస్తూ, దాని వైభవం ఏమాత్రం తగ్గకుండా చూస్తున్నాడు. నాకు నాలుగో కొడుకన్నాడు. కానీ నా ముగ్గురు కొడుకులకు టెన్షన్‌గా ఉంది.. ఎప్పుడేవైనా నేను రాసిచ్చేస్తానేమోనని. మీకు శిరీష్, బన్నీయే తెలుసు.. ఇంకోడున్నాడు, బాబీ అని నా పెద్దకొడుకు. ప్రొడ్యూసర్‌గా త్వరలో వస్తున్నాడు, హీరోగా కూడా వచ్చే ఆలోచనలో వున్నాడు" అని ఆయన చెప్పారు. 'ప్రతిరోజూ పండగే' సినిమాని రాజమండ్రి పరిసరాల్లోనే ఎక్కువగా తీశారనీ, ఈ ప్రాంతాన్ని అందంగా చూపించారనీ ఆయనన్నారు. 

"అందుకని ఈ ఫంక్షన్‌ను ఇక్కడ చెయ్యడమే కరెక్టనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నాం. ఈ సినిమా విజయం ఇద్దరిది.. మారుతి, సాయితేజ్‌ది. ఈ కలెక్షన్స్, ఈ హైప్ రావడానికి బ్యానర్లు, మేము.. అన్నీ ఉన్నా కూడా వాళ్లిద్దరూ ప్రధానమైన మనుషులు. వీళ్లిద్దరూ నాకు వెరీ క్లోజ్. ఒకడు మేనల్లుడైతే, ఇంకొకడు నా కొడుకులాంటోడు. వీళ్లిద్దరూ కలిసి నాకీ సినిమా ఇచ్చారు అనే ఫీలింగ్ ఉంటుంది. సాయితేజ్‌ను మేనల్లుడంటాడేమిటని కొంతమందికి సందేహం ఉండొచ్చు. చిరంజీవికి సాయితేజ్ మేనల్లుడు. చిరంజీవి, నేను బంధుత్వానికి బావామరుదులం కానీ, ఆత్మీయతకు అన్నదమ్ముల్లా ఉంటాం. కనుక సాయితేజ్ నాకు మేనల్లుడు. వాళ్లమ్మ చిరంజీవికి సిస్టర్ అయితే, నాకూ సిస్టరే. అందుకే ఇతన్ని మేనల్లుడుగానే చూస్తాను" అంటూ ఎమోషనల్ అయ్యారు.

"సినిమా రిలీజైన రెండో రోజున ఒకతను నాకు ఫోన్ చేసి, "అన్నయ్యా! మా ఎన్నారైలను పట్టుకొని ఇలా ఇరగదీశారేమిటి?" అనడిగాడు. నిజానికి మారుతి ఎన్నారైని అడ్డం పెట్టుకొని బంధుత్వాల్లో ఉంటున్న ఆ దూరాన్ని తగ్గించాలనే మంచి ఉద్దేశంతో ఈ సినిమా తీశాడు. ఇవాళ ముసలి తల్లిదండ్రుల్ని మనం సరిగా చూడ్డం లేదు. 'నెగ్లెక్ట్ చెయ్యకండి, ఎక్కడ్నుంచి వచ్చారో గుర్తుపెట్టుకోండి' అనే కథని మారుతి ఎంత చక్కగా రాశాడో, తండ్రికి బుద్ధిచెప్పి, కొడుకు తాతదగ్గరకు వెళ్లిపోయే పాత్రను అంత బాగా సాయితేజ్ క్యారీ చేశాడు. చివరి 20 నిమిషాల్లో సాయితేజ్ చేసిన నటనవల్ల సినిమాకు ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ వచ్చింది. సినిమాలో సత్యరాజ్, రావు రమేశ్ చాలా చక్కగా నటించారు. మ్యూజిక్ చాలా బాగుంది" అని చెప్పారు అరవింద్.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.