
వైవిధ్యమైన పాత్రలతో, అద్భుతమైన నటనతో టాలీవుడ్, కోలీవుడ్లలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh). గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ బ్యూటీ, తాజాగా ఓ సినిమా ఈవెంట్లో భావోద్వేగానికి లోనయ్యారు.
తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'ఓ సుకుమారి' (Oh Sukumari). ఈ సినిమా టీజర్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో తిరువీర్ గురించి ఐశ్వర్య రాజేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
స్టేజ్ పై ఐశ్వర్య మాట్లాడుతూ.. "హీరో తిరువీర్కు ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. తను నిజంగానే ఒక ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. నేను చాలా సార్లు తిరువీర్ను చూసినప్పుడు ఒక మాట చెప్పాను. అతన్ని చూస్తుంటే నాకు మా నాన్నగారే గుర్తొస్తుంటారు" అంటూ తన మనసులోని భావాలను పంచుకున్నారు.
తిరువీర్ హైట్, అతని పర్సనాలిటీ చూసినప్పుడల్లా మా నాన్నగారిని చూసినట్లు అనిపిస్తుందని ఐశ్వర్య ఎమోషనల్ అయ్యారు. ఆల్రెడీ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, ఈ సినిమా తర్వాత పరిశ్రమలో ఒక పెద్ద స్టార్గా ఎదగాలని ఆమె మనసారా ఆకాంక్షించారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడిన ఈ వీడియో క్లిప్ తెగ హల్చల్ చేస్తోంది. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ ఆమె పలికిన ఎమోషనల్ మాటలు అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాయి.





