
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న మలయాళ నటి సజిని (Sajini) తన సొంత కుటుంబ సభ్యులే తనపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కష్టార్జితంతో కొన్న ఆస్తిని కాజేసేందుకు తన అక్క, ఆమె పిల్లలు తనపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.
నటి సజిని 1990లలో కేవలం 90 రూపాయలతో హైదరాబాద్కు వచ్చి, సినీ రంగంలో అంచలంచెలుగా ఎదిగారు. తన సంపాదనతో 2001లో జూబ్లీహిల్స్లో ఒక ఇంటిని కొనుగోలు చేసి, తన తల్లి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ సమయంలో తన అక్కను, ఆమె భర్తను, నలుగురు పిల్లలను సజిని చేరదీసి, ఆశ్రయం కల్పించారట.
సజిని తల్లి ఇటీవల మరణించారు. తల్లి చనిపోయిన 15 రోజుల నుండే అసలు గొడవ మొదలైందని సజిని తెలిపారు. ప్రస్తుతం ఆ ఆస్తి విలువ సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ ఆస్తిపై కన్నేసిన తన అక్క.. ఆమె నలుగురు కూతుళ్లు, అల్లుళ్లతో కలిసి తనను ఆ ఇంట్లో నుండి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సజిని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ఇంట్లో మొత్తం 18 గదులు ఉండగా, కేవలం ఒకే ఒక గదిని తనకు ఇచ్చి మిగతా ఇల్లంతా వారు ఆక్రమించుకున్నారని సజిని తెలిపారు. తన భర్తపై కూడా వారు మర్డర్ కేసులు, రేప్ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా, పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని నటి సజిని కోరుతున్నారు.





