
టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి గుప్త (Gayathri Gupta). కెరీర్ పరంగా ఎంత ధైర్యంగా కనిపిస్తారో, వ్యక్తిగత జీవితంలో అంతకు మించిన పోరాటాన్ని ఎదుర్కొన్నారు. తాజాగా ఆమె తెలుగువన్(TeluguOne)కు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చీకటి కోణాలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిత్యం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే గాయత్రి వెనుక ఇంతటి వేదన ఉందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఈ ఇంటర్వ్యూలో గాయత్రి తన బాల్యం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి చాలా కఠినంగా ఉండేవారని, చిన్నతనంలో తన తల్లిని కొట్టడమే కాకుండా.. ఏకంగా కరెంట్ షాక్లు పెట్టడం, వాతలు పెట్టడం వంటి భయంకరమైన పరిస్థితుల మధ్య తాను పెరిగానని చెబుతూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కేవలం 16 ఏళ్ల వయసుకే తన తల్లికి తాను పుట్టానని, ఆ పరిస్థితుల్లో తన తల్లి కూడా ఎన్నో ఇబ్బందులు పడిందని గాయత్రి వివరించారు.
ఇక తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. తనకు పెళ్లైన వారం రోజులకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. అది ఒక టాక్సిక్ మ్యారేజ్ అని, అక్కడ శారీరక, మానసిక వేధింపులు ఎక్కువగా ఉండటం వల్లే అంత త్వరగా ఆ బంధం నుంచి బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. పెళ్లి అనేది ఒక పెద్ద స్కామ్ అని, ఆడపిల్లలకు రక్షణ లేని చోట ఉండటం కంటే ఒంటరిగా పోరాడటమే మిన్న అని ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు.
సినిమా ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాలను కూడా గాయత్రి నిర్మొహమాటంగా పంచుకున్నారు. టాలెంట్ ఉన్నప్పటికీ నిజాలు మాట్లాడటం వల్లే తనను కమర్షియల్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేశారని ఆమె ఆరోపించారు. కాస్టింగ్ కౌచ్ వంటి ఇష్యూలపై గళం ఎత్తడం వల్ల కొన్ని పెద్ద ప్రొడక్షన్ హౌస్లు తనను పక్కన పెట్టాయని, అయినప్పటికీ తాను వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు. టాలెంట్ చూసి అవకాశాలు ఇవ్వాలి కానీ, ఒక అమ్మాయిని శారీరకంగా ఉపయోగించుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు.
ప్రస్తుతం 'ఫస్ట్ టైమ్' అనే సినిమాలో ఒక ఆసక్తికరమైన పాత్ర పోషిస్తున్నానని, త్వరలోనే సొంతంగా ఒక ప్రేమకథను డైరెక్ట్ చేయాలనే లక్ష్యంతో ఉన్నానని ఆమె వెల్లడించారు.
గాయత్రి గుప్త ఫుల్ ఇంటర్వ్యూతో పాటు, మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.






