
- బాలకృష్ణ చంటి పిల్లాడు
- 'భైరవద్వీపం' షూటింగ్ సమయంలో జరిగింది ఇదే
- బాలయ్య రహస్యం బయటపెట్టిన చిట్టిబాబు
నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అంటేనే ఒక వైబ్రేషన్. సిల్వర్ స్క్రీన్ పై ఆయన కనిపిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. అయితే కెమెరా వెనుక బాలయ్య ఎలా ఉంటారు? ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? అనే విషయాలపై తాజాగా సీనియర్ నటుడు చిట్టిబాబు(Chitti Babu) చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణతో తనకున్న అనుబంధం గురించి మనసు విప్పి మాట్లాడారు.
చిట్టిబాబు మాట్లాడుతూ.. బాలయ్యను బయట చూసేవారు ఆయన చాలా సీరియస్ అనుకుంటారని, కానీ నిజానికి ఆయన ఒక 'చంటి పిల్లాడు' అని అన్నారు. షూటింగ్ సెట్స్లో అయినా, బయట అయినా ఆయన ప్రవర్తన చాలా స్వచ్ఛంగా ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా ఒకప్పుడు బాలయ్యతో కలిసి రైలు ప్రయాణం చేసినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఆయనలోని మానవత్వాన్ని కొనియాడారు.
ఒకసారి ట్రైన్ లో విజయవాడ వెళ్తుండగా.. "తాను ప్యూర్ బ్రాహ్మిణ్.. ప్యూర్ నాన్-వెజ్. నాటుకోడి అంటే చాలా ఇష్టం, మిషన్ కోడిని అసలు ముట్టను" అని తన ఆహారపు అలవాట్ల గురించి చిట్టిబాబు చెప్పగా.. బాలకృష్ణ బాగా నవ్వుకున్నారట. ఇద్దరి మధ్య బాండింగ్ ఎంతో బాగుండేదని గుర్తు చేసుకున్నారు.
అదే సమయంలో హరికృష్ణ నిర్మాతగా 'ఇన్స్పెక్టర్ ప్రతాప్' సినిమా కోసం బాలయ్యను ఒప్పించింది తానేనని చిట్టిబాబు వెల్లడించారు. మీరు డేట్స్ ఇస్తే పది మందికి అన్నం దొరుకుతుందని తాను అడగ్గానే, బాలకృష్ణ ఏమాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపారు. అంతేకాదు, ఆ సినిమాకి పూర్తి రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా, చూసీచూడనట్టు వదిలేశారని చెప్పారు. ఆ సమయంలో బాలయ్య చూపిన ఉదారత గ్రేట్ అని కొనియాడారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 'భైరవద్వీపం' షూటింగ్ సమయంలో బ్రేక్ దొరికినప్పుడల్లా తాము పేకాడుకునే వాళ్లమని చిట్టిబాబు చెప్పారు. ఆ సమయంలో బాలయ్య చాలా సరదాగా ఉండేవారని, ఆటలో ఎవరైనా గెలిస్తే ఎంతో స్పోర్టివ్గా తీసుకునేవారని పేర్కొన్నారు.
అప్పట్లో బాలయ్యకు తాను 'మృత్యుంజయుడు' అనే ఒక కథ కూడా చెప్పానని, అది ఆయనకు ఎంతో నచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు చిట్టిబాబు. ఆ కథ విన్న తర్వాత బాలయ్య చాలా ఉత్సాహపడ్డారు. క్లైమాక్స్ మార్చడానికి అవసరమైతే కొన్ని రోజులు కూర్చుని చర్చిద్దామని, ఈ స్టోరీని ఎవరికీ చెప్పవద్దని బాలకృష్ణ తన దగ్గర ప్రామిస్ కూడా చేయించుకున్నారని చిట్టిబాబు తెలిపారు.
బాలకృష్ణకు తన అమ్మనాన్నలన్నా, దైవమన్నా ఎంతో భక్తి అని, ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతకైనా వెళ్తారని చిట్టిబాబు ప్రశంసించారు. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఎంతో మంది హీరోలను చూశానని, కానీ బాలయ్య లాంటి నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తిని చూడలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చిట్టిబాబు చేసిన ఈ వైరల్ కామెంట్స్ నందమూరి అభిమానులను ఖుషీ చేస్తున్నాయి.
బాలయ్య మంచితనం గురించి ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా కథలు ఉన్నప్పటికీ, చిట్టిబాబు చెప్పిన ఈ ఇన్సైడ్ స్టోరీస్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. చిట్టిబాబు పూర్తి ఇంటర్వ్యూ కోసం, మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం తెలుగువన్(TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.






