Home

»

Latest News

'కేజీఎఫ్‌' తర్వాత 60 కథలు విన్నా ఆయనకు మా కథే నచ్చింది!

Dec 15, 2022 2:12PM

సినీ జర్నలిస్ట్‌గా, పీఆర్‌ఓగా, శాటిలైట్‌ కన్స్‌ల్‌టెంట్‌గా సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన వ్యక్తి కె.రాఘవేంద్రరెడ్డి. ఆయన 'శాసనసభ' చిత్రం ద్వారా రచయితగా పరిచయవుతున్నాడు. ఇంద్రసేన హీరోగా వేణు మడికంటి దర్శకత్వంలో సప్పాని బ్రదర్స్‌ నిర్మించిన పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన రాఘవేంద్రరెడ్డి 'శాసనసభ' చిత్ర విశేషాలను పంచుకున్నారు.

మీ నేపథ్యం గురించి?  
పొలిటికల్ జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించాను. ఆ తరువాత సినీ జర్నలిస్టుగా పీఆర్‌ఓగా, శాటిలైట్‌కన్సల్‌టెంట్‌గా పనిచేశాను. సినీ పరిశ్రమలో నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. కాని మొదట్నుంచి సినీ పరిశ్రమకు రచయితగా కావాలనే వచ్చాను.. అప్పటి నుంచి ప్రయ్నతం చేశాను. నా కెరీర్‌ కంటే ఫ్యామిలీ కోసం రిస్క్‌ తీసుకోవద్దని ఆగాను. ఇప్పుడు అంతా బాగుంది.. అందుకే రచయితగా కెరీర్‌ను ప్రారంభించాను.

జర్నలిస్ట్‌గా మీకున్న అనుభవంతో 'శాసనసభ' పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథను తయారుచేశారని అనుకోవచ్చా?
ఈ కథ రాయడానికి కారణం హీరో ఇంద్రసేన. ఆయన నాకు మంచి ఫ్రెండ్‌.. ఆయన్ని చూస్తే కర్ణాటక హీరోలకు తీసిపోని విధంగా వుంటాడు. ఆయన కోసం రాసిన కథ. మొదట్లో 'అసెంబ్లీ' అనే అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా ప్రారంభించాం. ఈ సినిమా కథ నచ్చి సప్పని బ్రదర్స్‌ ముందుకు వచ్చారు. వారి వల్ల ప్రొడక్షన్‌ వాల్యూస్‌ పెరిగాయి. నేను ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదవడం, రాజకీయ జర్నలిస్టుగా వున్న అనుభవం కూడా ఈ సినిమా కథకు ఉపయోగపడింది. 

'శాసససభ'కు రవిబసూర్‌ సంగీతం అందించడం ఎలా కుదరింది? 
కేజీఎఫ్‌, కేజీఎఫ్‌-2 తరువాత రవిబసూర్‌కు వున్న క్రేజ్‌ తెలిసిందే. ఆయన ఈ రోజు 'శాసనసభ' సినిమాకు సంగీతం అందించడం కేవలం నిర్మాత షణ్ముగం సప్పని వల్లే సాధ్యపడింది. ఆయన రవిబసూర్‌ వద్దకు తీసుకెళ్లి కథ వినిపించడం.. కేజీఎఫ్‌ తరువాత అరవై కథలు విన్నా రిజెక్ట్‌ చేసిన రవిబసూర్‌ మా కథను ఒప్పుకోవడంతో గర్వంగా అనిపించింది. ఈ రోజు ఆయన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణంగా వుంటుంది.

ఈ చిత్రంలో కమర్షియల్‌ వాల్యూస్‌ ఏం వున్నాయి? 
రాజకీయాల్లోజరిగిన సంఘటనల స్ఫూర్తిగా తీసుకుని శాసనసభ కథను రాశాను. శాసనసభ అంటే పవిత్రస్థలం.. దానిని దేవాలయంగా భావించాలి. కానీ నేడు శాసనసభ వాల్యూ మసకబారుతున్నట్లు అనిపించింది. అందునే దాని వాల్యూను ఈ తరం వాళ్లకు తెలియజెప్పాలి అనే వుద్దేశంతో ఈ కథను రాశాను. శాసనసభ వాల్యూను పెంచే విధంగా కమర్షియలాలిటి యాడ్‌చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రంలో ఏ ఒక్క వ్యక్తులను టార్గెట్‌ చేయలేదు. కాని రాజకీయ వ్యవస్థలో వున్న లోటుపాట్లను డిస్కస్‌ చేశాం. ఓటు విలువ తెలియజెప్పడం కోసం చేసిన కథ. అందరికి బాధ అనిపించే ఓ విషయాన్ని గుర్తు చేస్తున్నాం. మేము రాసిన కథకు కాకతాళియంగా సమకాలీన రాజకీయాలకు కుదిరాయి.

రాజేంద్రప్రసాద్‌ పాత్ర ఎలా వుంటుంది?
రాజేంద్రప్రసాద్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా వుంటుంది. నారాయణస్వామిగా ఓటు విలువ చెప్పే పాత్ర ఆయనది. రాజేంద్రప్రసాద్‌ పాత్ర అందరి హృదయాలను హత్తుకునే విధంగా వుంటుంది. 

ఈ చిత్రంలో వున్న సందేశంతో సమాజంలో, ప్రజల్లోమార్పు కనిపిస్తుదంటారా? 
చెపాలనుకున్న విషయాన్ని నిజాయితీగా చెప్పాం. ఈ చిత్రం వల్ల ఒకరిద్దరు మారినా మా ప్రయత్నం సక్సెస్‌ అయినట్లే. శాసనసభ ఓ బిల్డింగ్‌ కాదు.. ఇదొక పవిత్రస్థలం అని గుర్తుంచేయడం మా సినిమా ముఖ్య ఉద్దేశం. శాసనసభ ప్రతిష్టను పెంచే విధంగా వుంటుంది. ఈ సినిమాలో సమస్యతో పాటు పరిష్కారం కూడా వుంటుంది. 

మీరు అనుకున్న కథను దర్శకుడు ఎలా కన్వీన్స్‌ చేశాడు?
దర్శకుడు వేణు మడికంటి తన ప్రతిభతో చక్కగా తెరకెక్కించాడు. ప్రతి సన్నివేశం ఎంతో కన్వీన్సింగ్‌గా వుంటుంది. 

రచయితగా మీ తదుపరి చిత్రాలు ఏమిటి?
మరో పాన్‌ ఇండియా కథ తయారుచేశాను. ప్రస్తుతం ఎన్‌ఆర్‌ఐ నిర్మాతలు నా కథతో ఓ యాక్షన్‌ ఇన్విస్టిగేషన్‌ థ్ల్రిలర్‌ను నిర్మిస్తున్నారు. సినిమా అంతా విదేశాల్లోనే షూటింగ్‌ జరుగుతుంది. ఇది ఒక సమాజానికి ఉపయోగపడే కథ. ఇప్పటికే మూడు వారాలు కంటిన్యూగా చిత్రీకరణ పూర్తయింది. మరో క్రైమ్‌ థ్రిల్లర్‌కు కూడా కథను అందించాను.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com