'జై భీమ్' విడుదలైన ఇంత కాలానికి సూర్యపై కేసు పెట్టమన్న కోర్టు!
on May 5, 2022
లాయర్గా సూర్య నటించిన 'జై భీమ్' సినిమా విడుదలై కొన్ని నెలలు గడిచిపోయాయి. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు వీక్షకాదరణ లభించడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు అమితంగా లభించాయి. ఇన్నాళ్ల తర్వాత వన్నియార్ కులాన్ని కించపరిచేలా చూపించారనే అభియోగంపై సూర్య, నిర్మాత జ్యోతిక, డైరెక్టర్ టి.జె. జ్ఞానవేల్పై కేసు నమోదు చేయాల్సిందిగా తమిళనాడు కోర్టు ఆదేశించింది. పిటిషనర్ ఆరోపణలను విన్న కోర్టు, ఈ కేసుపై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.
సినిమాలో ఒక సన్నివేశంలో ఉపయోగించిన క్యాలెండర్లో అగ్నిగుండం చిహ్నం కనిపించడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ చిహ్నం వన్నియార్ కులానికీ, ఆ కులానికి సంబంధించిన రాజకీయ సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్తున్నారు. దీనిపై ఇదివరకే డైరెక్టర్ జ్ఞానవేల్ క్షమాపణలు తెలిపాడు.
'జై భీమ్' రిలీజయ్యాక.. అందులోని ఓ సీన్లో వన్నియార్ కులాన్ని కించపరిచేలా చూపించినందుకు క్షమాపణలు చెప్పాల్సిందిగా సూర్య, జ్ఞానవేల్తో పాటు అమెజాన్ ఇండియాకు వన్నియార్ సంగం ఒక లీగల్ నోటీస్ పంపింది. 'జై భీమ్'లో నుంచి ఆ సీన్ను తొలగించాలనీ, ఏడు రోజుల్లోగా రూ. 5 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందిగా వన్నియార్ సంగమ్ డిమాండ్ చేసింది. ఏదేమైనప్పటికీ, సినిమా రిలీజై ప్రేక్షకుల, విమర్శకుల ఆదరణను పొందిన పలు మాసాల తర్వాత ఈ కేసుపై విచారణ చేపట్టాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి సినిమా రిలీజైనప్పుడు సూర్యకు పలు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దాంతో కొన్ని రోజుల పాటు ఆయనకు పోలీసులు భద్రత కల్పించారు కూడా.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
