
ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’ (Rakshasapuram). కన్నడలో మంచి విజయం సాధించిన 'రక్కసపురదోల్' చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ చిత్రాన్ని మే 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు నిర్మాత కేఎస్ రామారావు అధికారికంగా ప్రకటించారు.
విభిన్నమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ బి శెట్టి ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో నటించారు. డాక్టర్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇన్వెస్టిగేషన్ డ్రామా నేపథ్యంలో సాగే కథనం ప్రేక్షకులను అడుగడుగునా థ్రిల్కు గురి చేస్తుంది.
విడుదల తేదీ మార్పుపై నిర్మాత కేఎస్ రామారావు స్పందిస్తూ.. "ఈ సినిమాలోని మేకింగ్ విలువలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అందుకే ఎలాంటి రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నాం. సినిమాను మే 1న విడుదల చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ, మరిన్ని మెరుగైన థియేటర్లు, గరిష్ట స్థాయిలో ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసేందుకు వీలుగా మే 7న విడుదల చేస్తున్నాం. వేసవి సెలవుల దృష్ట్యా ఈ తేదీ సినిమాకు కలిసి వస్తుందని భావిస్తున్నాం." అని ఆయన తెలిపారు.
ప్రస్తుతం ఐపీఎల్ సందడి, ఓటీటీల పోటీ ఉన్నప్పటికీ.. కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ‘రాక్షసపురం’ కచ్చితంగా ఆ కోవలోకి వస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేయనున్నారు.




.webp)

