'శేఖర్' సినిమా నాది.. వాళ్ళు అప్పు చేస్తే నాకేం సంబంధం?
on May 24, 2022
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన లేటెస్ట్ మూవీ 'శేఖర్' మే 20న థియేటర్స్ లో విడుదల కాగా ఓ వివాదం కారణంగా రెండు రోజులకే ఈ సినిమా ప్రదర్శనకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. 'శేఖర్' మూవీ కోసం తన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు నిర్మాత, దర్శకురాలు జీవిత రాజశేఖర్ తిరిగి చెల్లించకపోవడంతో ఫైనాన్షియర్ ఎ. పరంధామరెడ్డి కోర్టును ఆశ్రయించడంతో.. ఈ సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. అయితే ఈ సినిమాకి నిర్మాతను తాను అని.. కోర్టు ఆదేశించకపోయినా సినిమా ప్రదర్శన నిలిపి వేసి తనకు నష్టం కలిగేలా చేశారని బీరం సుధాకర్ రెడ్డి అన్నారు.
శేఖర్ వివాదంపై తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన బీరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. "సినిమాకి ఓనర్ నిర్మాత అవుతాడు గానీ.. హీరోలు, దర్శకులు కారు. శేఖర్ సినిమా నిర్మాతని నేను. లీగల్ గా సినిమాపై సర్వ హక్కులు నావి. జీవిత గారు ఈ సినిమాకి దర్శకత్వం మాత్రమే వహించారు. సినిమాలో వారి కుమార్తెల పేర్లు వేసినా లీగల్ గా మాత్రం సినిమా ప్రొడ్యూసర్ ని నేనే. నేను దుబాయ్ లో ఉంటాను.. ఇక్కడ సినిమా పనులు వారు చూసుకున్నారు కాబట్టి ఆ గౌరవం కొద్దీ వారి పేర్లు కూడా వేశాం. ఈ సినిమాకి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ నా పేరు మీదే ఉన్నాయి. అలాంటప్పుడు జీవిత గారితో ఏదో వివాదం ఉంటే నా సినిమాని ఎలా ఆపేస్తారు?. అసలు ఈ సినిమా ప్రదర్శన నిలిపి వేయాలని కోర్టు ఆదేశాలు ఇవ్వలేదు. సినిమా రైట్స్ ఎటాచ్మెంట్ చేయమని మాత్రమే కోర్టు చెప్పింది. ఆ విషయాన్ని మేం చెప్పినా వినకుండా క్యూబ్, యూఎఫ్ఓ లు సినిమా ప్రదర్శనలు నిలిపేశాయి. అందరూ కలిసి నా సినిమాని చంపేశారు. ఈ సినిమా కోసం 15 కోట్లు ఖర్చు పెట్టాను. నాకు జరిగిన అన్యాయానికి, నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాము. ఈ 25 లేదా 27 న కోర్టులో ఈ సినిమాకి ఓనర్ ఎవరు అనేది తెలిసిపోతుంది. అప్పుడు నాకు జరిగిన నష్టానికి ఫైనాన్షియర్ పరంధామరెడ్డి, క్యూబ్, యూఎఫ్ఓ లు ఎవరెవరు ఎంత బాధ్యత వహించాలో కూడా తేలిపోతుంది." అన్నారు.
శేఖర్ సినిమా వివాదంపై మే 25 లేదా 27 న మరోసారి కోర్టులో విచారణ జరగనుందని తెలుస్తోంది. శేఖర్ సినిమాకి జీవిత దర్శకురాలు మాత్రమే అని, ఆమెతో వివాదముంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి గానీ, తాను కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన సినిమాని ఎలా అడ్డుకుంటారని బీరం సుధాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వివాదంపై కోర్టు ఎలా స్పందిస్తుందేమో చూడాలి.