డీఎస్పీ, తమన్, అనూప్.. ఆరేళ్ళ క్రితం అలా, ఇప్పుడిలా..!
on Jan 13, 2022
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్, మెలోడీ స్పెషలిస్ట్ అనూప్ రూబెన్స్.. తెలుగునాట తమదైన బాణీలతో ముందుకు సాగుతున్న యువ సంగీత తరంగాలు. ఈ ముగ్గురు కూడా పలు విజయవంతమైన చిత్రాలకు స్వరాలు సమకూర్చారు. ఇక సంక్రాంతి సీజన్ లోనూ ఈ ముగ్గురికీ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అంతేకాదు.. ఆరేళ్ళ క్రితం ఈ ముగ్గురు ఒకే ఏడాది పొంగల్ కి పోటీ పడ్డారు. కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి ఆ బాట పడుతున్నారు. కాకపోతే.. అప్పుడు మూడు వరుస రోజుల్లో వీరి సినిమాలు సందడి చేస్తే... ఇప్పుడు మాత్రం ఒకే రోజు వీరి కొత్త చిత్రాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. 2016లో డీఎస్పీ మ్యూజిక్ అందించిన `నాన్నకు ప్రేమతో` జనవరి 13న రిలీజ్ కాగా, తమన్ ట్యూన్స్ కట్టిన `డిక్టేటర్` జనవరి 14న విడుదలైంది. అనూప్ స్వరకల్పనలో తెరకెక్కిన `సోగ్గాడే చిన్ని నాయనా` జనవరి 15న థియేటర్స్ లో ఎంటర్టైన్ చేసింది. కాగా, ఆరేళ్ళ తరువాత ఈ ముగ్గురు మళ్ళీ 2022 సంక్రాంతి సీజన్ లో పోటీపడుతుండగా.. వారి కొత్త చిత్రాలు `రౌడీ బాయ్స్`, `సూపర్ మచ్చి`, `బంగార్రాజు` ఒకే రోజు (జనవరి 14)న రాబోతున్నాయి. దేవి శ్రీ సంగీతంలో `రౌడీ బాయ్స్`, తమన్ బాణీలతో `సూపర్ మచ్చి`, అనూప్ స్వరాలతో `బంగార్రాజు` ఈ పండక్కి సందడి చేయనున్నాయి. మరి.. ఈ ముగ్గురు కూడా సంక్రాంతి వేదికగా మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.