ENGLISH | TELUGU  

విలేజ్ నేటివిటీ, వింటేజ్ సీన్స్ తో అందరికీ కనెక్ట్  అయ్యే చిత్రం 'మధురం': హీరో ఉదయ్ రాజ్

on Apr 17, 2025

 

ఆచార్య, ఆర్ఆర్ఆర్ లాంటి పలు క్రేజీ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి.. ‘మధురం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు ఉదయ్ రాజ్. రాజేష్ చికిలే దర్శకత్వం వహించారు.  వైష్ణవి సింగ్ హీరోయిన్‌గా నటించింది.  శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై   యం.బంగార్రాజు నిర్మించారు.  ‘ఎ మెమొరబుల్ లవ్’ ట్యాగ్ లైన్‌తో  టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన  ఈ చిత్రం  ఏప్రిల్ 18న శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ చిత్ర విశేషాలను గురించి ఇలా ముచ్చటించారు. 

 

- చిన్నప్పట్నుంచీ చిరంజీవి గారిపై ఇష్టం ఉండేది. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. తర్వాత ‘ఆచార్య’ షూటింగ్ టైమ్‌లో ఆయన మాట్లాడటం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. 12 ఏళ్లగా ఇండస్ట్రీలో ఉన్నా. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా వర్క్ చేశా. చాలా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా నటించాను. బంగార్రాజు గారి సపోర్ట్‌తో ‘మధురం’ చిత్రంలో హీరోగా చేశా. 

- దర్శకుడు  రాజేష్ చికిలేతో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. ఆయన ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యాను. నైంటీస్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఇది. పదవ తరగతి అమ్మాయి, తొమ్మిదో తరగతి అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ చాలా అందంగా ఉంటుంది. 

- ఇందులో మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌లో కనిపిస్తాను. చిన్న పిల్లాడిగా, స్కూల్ స్టూడెంట్‌గా, మిడిల్ ఏజ్ వ్యక్తిగా మూడు గెటప్స్ వేయడానికి చాలా కష్టపడ్డా. కొన్ని సీన్లలో కొంచెం చబ్బీగా కనిపిస్తా. మళ్లీ సన్నగా అవడం కోసం ఫుడ్ తినడం మానేసి కొన్ని రోజులు కేవలం నీళ్లు మాత్రమే తాగాను. 

- డైరెక్టర్ గారు, నేను చదువుకుంది జెడ్‌పీహెచ్ స్కూల్‌లోనే కావడంతో అప్పటి విశేషాలను గుర్తు చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. నైంటీస్‌లో స్కూల్స్ ఎలా ఉండేవి, అప్పటి పిల్లలు ఎలా బిహేవ్ చేశారనే వాటిపై కొన్ని రీసెర్చ్‌లు చేశాం. స్కూల్‌కి సైకిల్ వేసుకెళ్లి.. అమ్మాయి ముందు బ్రేక్ కొట్టడం, చేతులు వదిలేసి తొక్కడం లాంటి సీన్లతో పాటు విలేజ్ నేటివిటీ, వింటేజ్ సన్నివేశాలు  అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. 90ల జనరేషన్‌కు  పాత విషయాలను గుర్తుచేసేలా సినిమా ఉంటుంది. ఇందులో కథే హీరో అని భావిస్తారు.  షూటింగ్ అంతా లైవ్ లొకేషన్‌లో చేశాం.
 
- హీరోయిన్‌గా తెలుగమ్మాయిని తీసుకోవాలనుకున్నా.. కొన్ని ప్రయత్నాలుచేశాం కానీ కుదరలేదు. అయితే వైష్ణవి సింగ్ మాత్రం చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. మధు, రామ్‌ల ప్రేమాయణమే ఈ మధురం చిత్రం. దర్శకుడు రాజేష్ చికిలే ఈ కథను చాలా అందంగా తీర్చిదిద్దారు. 

- నాకు ఏదీ అంత ఈజీగా రాలేదు. చాలా కష్టపడితే కానీ అవకాశాలు వచ్చాయి.  ఈ సినిమా విషయంలోనూ  కొన్ని సమస్యలు ఫేస్ చేశాను. కానీ నిర్మాత బంగార్రాజు గారు అన్ని విషయాల్లో సపోర్ట్‌గా నిలిచి నాకు ధైర్యాన్ని ఇచ్చారు.  నాతో పాటు దర్శకుడు రాజేష్, మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ గారితో సహా అంతా కొత్త వాళ్లమైనా అందర్నీ ఎంకరేజ్ చేస్తూ  చాలా డేరింగ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాపై నమ్మకంతో నిర్మాత బంగార్రాజు గారే సొంతంగా రిలీజ్ చేస్తున్నారు.

- టీజర్, ట్రైలర్ చూసిన వాళ్లు చాలా ప్లెజెంట్‌గా ఉందని కాంప్లిమెంట్ ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. అలాగే పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంకీ వీణ గారు అద్భుతమైన సంగీతం అందించారు. 

- ఈ సినిమా విషయంలో చాలా మంది నాకు సపోర్ట్‌గా నిలిచారు. ముందుగా విశ్వక్ సేన్ గారు పోస్టర్ లాంచ్ చేశారు. తర్వాత నితిన్ గారు టీజర్‌‌ను, వీవీ వినాయక్ గారు ట్రైలర్‌‌ను విడుదల చేసి సపోర్ట్‌గా నిలిచారు.  వినాయక్ గారిని కలవడం, ఆయన నా గురించి చెప్పిన మాటలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి. హీరోనే  కాకుండా ఎలాంటి పాత్రలు చేయడానికికైనా నేను సిద్ధంగా ఉంటాను. ఎలాంటి చిన్న రోల్ అయినా చేస్తాను.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.