రాజశేఖర్ `ఓంకారం`కి పాతికేళ్ళు!
on Jan 22, 2022
సీనియర్ స్టార్ రాజశేఖర్ ని కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రాల్లో `ఓంకారం` ఒకటి. కన్నడనాట ఘనవిజయం సాధించిన `ఓమ్`(1995) చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. మాతృకని తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు, నటుడు ఉపేంద్ర.. తెలుగు వెర్షన్ ని కూడా డైరెక్ట్ చేశారు. తెలుగులో దర్శకుడిగా ఉపేంద్రకిదే మొదటి సినిమా కావడం విశేషం. అలాగే ఒరిజనల్ వెర్షన్ లో నాయికగా నటించిన ప్రేమ ఇందులోనూ అదే పాత్రలో కనిపించగా.. `మైనే ప్యార్ కియా` (తెలుగులో `ప్రేమ పావురాలు`) ఫేమ్ భాగ్యశ్రీ ఓ ముఖ్య పాత్రలో దర్శనమిచ్చారు. ప్రముఖ నటులు జేవీ సోమయాజులు ప్రధాన పాత్ర పోషించారు. ప్రేమ కోసం గ్యాంగ్ స్టర్ గా మారిన ఓ యువకుడి కథే ఈ `ఓంకారం` చిత్రం.
మాతృక స్వరకర్త హంసలేఖ బాణీలు సమకూర్చిన ఈ చిత్రంలో `గానగంధర్వుడు` ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన ``ఓ గులాబీ`` గీతం విశేషాదరణ పొందింది. అలాగే ``కాలేజీ కుర్రోడు``, ``బుల్లెమ్మ``, ``దిల్ రుబా``, ``ఓం బ్రహ్మాండ`` పాటలు కూడా రంజింపజేశాయి. 1997 జనవరి 23న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్న `ఓంకారం`.. ఆదివారంతో పాతికేళ్ళు పూర్తిచేసుకుంటోంది.