
రీజినల్ సినిమాలకు రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం అనేది గొప్ప విషయం. అందుకే మేకర్స్ రూ.100 కోట్ల పోస్టర్ ను ఘనంగా విడుదల చేస్తుంటారు. అయితే కొందరు ఆ మార్కుకి 10-20 కోట్లకు దూరంగా ఆగిపోయినా సరే.. వంద కోట్ల పోస్టర్ రిలీజ్ చేయడం చూస్తుంటాం. ఇది పబ్లిసిటీ కోసమేనని అందరూ భావిస్తుంటారు. అయితే, ఈ 100 కోట్ల పోస్టర్ వెనుక కేవలం పబ్లిసిటీ మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. దీని వెనుక రూ. 3 కోట్ల అదనపు లాభాలను తెచ్చిపెట్టే బిజినెస్ సీక్రెట్ దాగి ఉంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో థియేట్రికల్ రన్తో పాటు ఓటీటీ రైట్స్ కూడా సినిమా బిజినెస్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓటీటీ సంస్థలు, నిర్మాతల మధ్య కొత్త రకమైన బిజినెస్ డీల్స్ రూపుదిద్దుకున్నాయి. గతంలో లాగా ఒక సినిమాకు ఫిక్స్డ్ రేట్ ను నిర్ణయించడం లేదు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఓటీటీ డీల్స్ అన్నీ కూడా ఒక బేస్ ప్రైస్, బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్ మైలురాళ్లపై ఆధారపడి ఉంటున్నాయి.
ఈ ఒప్పందాల ప్రకారం.. ఒక సినిమా డిజిటల్ హక్కులను ప్రాథమిక ధరతో కొనుగోలు చేస్తూనే, బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సాధించే వసూళ్లను బట్టి అదనపు చెల్లింపులు చేయడానికి ఒప్పందం చేసుకుంటారు. ఉదాహరణకు, ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద ముందుగా అనుకున్న మైలురాయిని, అంటే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను తాకితే.. ఓటీటీ సంస్థ నిర్మాతకు రూ. 3 కోట్లు అదనంగా చెల్లిస్తుందట.
అంటే, రూ. 100 కోట్ల బాక్సాఫీస్ గ్రాస్ దాటడం వల్ల నిర్మాతలకు ఏకంగా రూ. 3 కోట్ల వరకు అదనపు లాభం ఓటీటీ డీల్ ద్వారా సమకూరుతుంది. కేవలం ఒక పోస్టర్ పబ్లిసిటీ చేయడం ద్వారా వచ్చే ఈ రూ. 3 కోట్ల అదనపు ప్రాఫిట్ అనేది ఏ నిర్మాతకైనా చాలా పెద్ద ప్లస్ పాయింట్. అందుకే థియేటర్లలో వసూళ్లు కొద్దిగా అటుఇటుగా ఉన్నప్పటికీ, ఎలాగైనా రూ. 100 కోట్ల గ్రాస్ సాధించామని అధికారికంగా ప్రకటించడానికి నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు.
Tollywood, OTT Deals, 100 Crore Poster






