
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)వార్ 2 తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ప్రచార చిత్రాలు రిలీజ్ అయినప్పుడు వార్ 2 ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ తో పాటు మేకర్స్ కూడా నమ్మారు. కానీ అనుకున్నంత రేంజ్ అయితే సక్సెస్ అవ్వలేదు. తాజాగా వార్ 2 తో పాటు మరొకొన్ని స్పై యాక్షన్ సినిమాలపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది.
భారతీయ చలనచిత్ర రంగంలో ఒకప్పుడు గూఢచారి సినిమాలు అంటే కేవలం ఇంటెలిజెన్స్, మైండ్ గేమ్స్, అత్యంత రహస్య ఆపరేషన్స్ మాత్రమే గుర్తొచ్చేవి. కానీ, మారుతున్న నేటి ట్రెండ్లో వంద మంది శత్రువులని ఒంటిచేత్తో తుత్తునియలు చేసే సూపర్ హీరోల్లా మన గూఢచారులని తెరపై చూపిస్తున్నారు. కేవలం దేశభక్తి, భారీ యాక్షన్ ఎలివేషన్స్ పేరుతో స్పై జానర్ తన అసలు సిసలైన రూపాన్ని కోల్పోతుందా!. వార్ 2 ని నిర్మించిన యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్పై యూనివర్స్లో వచ్చిన 'పఠాన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన బ్లాక్బస్టర్ హిట్ సాధించడంతో, అదే యాక్షన్ ఫార్ములా ఎప్పటికీ వర్కౌట్ అవుతుందని ఇండస్ట్రీ మేకర్స్ బలంగా భావించారు. కానీ బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి అత్యంత భారీ మల్టీస్టారర్ కాంబినేషన్లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'వార్ 2' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కథలోని అసలైన భావోద్వేగాలని ను, బలమైన కథనాన్ని పక్కనబెట్టి కేవలం మైండ్ బ్లోయింగ్ యాక్షన్, వందల కోట్ల బడ్జెట్ పైనే అతిగా ఫోకస్ పెట్టడం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేక ఘోరంగా విఫలమైంది.
దీనికి పూర్తి భిన్నంగా, రియలిస్టిక్ ఆపరేషన్స్ మరియు పక్కా ఇంటెలిజెన్స్ గేమ్తో సాగే 'ధురందర్' సిరీస్ బాక్సాఫీస్ వద్ద అక్షరాలా 3000 కోట్లకి పైగా భారీ వసూళ్లని సాధించి సరికొత్త రికార్డులని సృష్టించింది. ఈ సిరీస్ లోని 'ధురందర్ 2: ది రివెంజ్' చిత్రం కేవలం మూడు వారాల్లోనే దేశీయంగా 1,041 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి, అత్యంత వేగంగా 1000 కోట్ల మైలురాయిని దాటిన తొలి హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. కేవలం 30 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1,783 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టి గ్లోబల్ లెవల్లో ప్రకంపనలు రేపింది. అలాగే గతంలో చాలా తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన 'ఉరి: ద సర్జికల్ స్ట్రైక్' చిత్రం కూడా కేవలం బలమైన ఎమోషన్తో సంచలన విజయం సాధించింది. దీన్నిబట్టి ప్రేక్షకులు కేవలం జెండా ప్రదర్శనలు, లౌడ్ దేశభక్తి నినాదాలు మాత్రమే కాకుండా.. సహజత్వానికి అత్యంత దగ్గరగా ఉండే కథలని మాత్రమే బలంగా కోరుకుంటున్నారని స్పష్టమవుతోంది.
Also read: Aishwarya Rajesh: 240 దేశాల్లో ఐశ్వర్య రాజేష్ మూవీ సంచలనం.. ఆట మొదలైంది
ప్రస్తుతం ఈ స్పై ప్రపంచాన్ని స్టార్ హీరోయిన్స్ కూడా శాసిస్తుండటం విశేషం. హాలీవుడ్ సిరీస్ 'సిటాడెల్', సమంత అద్భుతమైన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో వచ్చిన 'హనీ బన్నీ', అలాగే ఆలియా భట్ మరియు శర్వరీ లీడ్ రోల్స్ లో భారీ అంచనాలతో రాబోతున్న 'ఆల్ఫా' చిత్రాలు దీనికి ప్రత్యక్ష నిదర్శనం. ఆల్ఫా టీజర్లో యాక్షన్ సీక్వెన్సులు అదిరిపోయినప్పటికీ, ఇది మళ్లీ పాత ఫార్ములానే రిపీట్ చేస్తుందా అనే సందేహాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. మరోవైపు టాలీవుడ్ చరిత్రని గమనిస్తే.. సూపర్ స్టార్ కృష్ణ కాలంలో వచ్చిన 'గూఢచారి 116', ఇటీవల అడివి శేష్ అందించిన 'గూఢచారి', అలాగే కమల్ హాసన్ 'విశ్వరూపం' వంటి చిత్రాలు కల్ట్ క్లాసిక్స్గా నిలిచాయి. ఎందుకంటే ఈ చిత్రాలలో ఇంటెలిజెన్స్ తో పాటు ఒక బలమైన క్యారెక్టర్ జర్నీ , ఎమోషన్ ఉంటుంది. కానీ కేవలం హైటెక్ గాడ్జెట్స్, స్టైలిష్ యాక్షన్పై మాత్రమే ఆధారపడిన అఖిల్ 'ఏజెంట్', కళ్యాణ్ రామ్ 'అమిగోస్', నిఖిల్ 'స్పై', గోపీచంద్ 'చాణక్య' వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. కేవలం స్పై ట్యాగ్ చూసి ఆడియన్స్ థియేటర్లకు వచ్చే రోజులు పూర్తిగా పోయాయి. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాలంటే భారీ ఎలివేషన్ల కంటే రియలిజం, మైండ్ గేమ్, మనసుకి హత్తుకునే బలమైన కథే స్పై జానర్ భవిష్యత్తుని నిర్ణయించనున్నాయి.






