
తెలుగు ఓటీటీ ప్రేక్షకులని అలరించడానికి సరికొత్త పీరియాడిక్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఇసకపట్నం' సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ప్రతిష్టాత్మక ఒరిజినల్ సిరీస్ యొక్క ట్రైలర్ని హైదరాబాద్లో జరిగిన ఒక భారీ ఈవెంట్లో అధికారికంగా విడుదల చేసింది. 1990ల నాటి ఒక రేవు పట్టణం (హార్బర్ టౌన్) నేపథ్యంలో సాగే ఈ కథలో అధికారం, రాజకీయం, పగ, ప్రతీకారాలు ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి. కేవలం ట్రైలర్తోనే ఇండస్ట్రీలో భారీ అంచనాలను పెంచేసిన ఈ సిరీస్, ప్రేక్షకులకి ఒక సరికొత్త యాక్షన్ డ్రామాని పరిచయం చేయబోతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ 'ఇసకపట్నం' ఒరిజినల్ సిరీస్ని వచ్చే నెల జూలై 2వ తేదీన గ్లోబల్ ప్రీమియర్గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఒరిజినల్ తెలుగు భాషతో పాటు తమిళ, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లలోనూ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఇంగ్లీష్తో కూడా కలుపుకుని దాదాపు 15 అంతర్జాతీయ భాషల సబ్టైటిల్స్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 240కి పైగా దేశాలు మరియు ప్రాంతాలలో ఒకేసారి అందుబాటులోకి రానుంది.
ఇసకపట్నం అనే కోస్తా తీర ప్రాంతాన్ని 'నాయుడు' అనే అత్యంత శక్తివంతమైన, క్రూరమైన గ్యాంగ్స్టర్ తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. అతని అరాచకాలకు ఎదురుతిరిగి, ఆ నేర సామ్రాజ్యాన్ని కూల్చడానికి ముగ్గురు వ్యక్తులు ఏకమవుతారు. న్యాయం కోసం పోరాడే ఒక ధైర్యవంతురాలైన మహిళ, నమ్మకానికి, నైతిక విలువలకు మధ్య నలిగిపోయే ఒక అనుచరుడు, అలాగే పగతో రగిలిపోయే ఒక సామాన్య వ్యక్తి.. ఈ ముగ్గురి శక్తులు ఎలా కలిశాయి? నాయుడు సామ్రాజ్యాన్ని వారు ఎలా ఎదుర్కొన్నారు? అనే ఆసక్తికరమైన కోణంలో దర్శకుడు గ్యారీ బిహెచ్ ఈ కథను మలిచారు. ఇందులో నాయుడు పాత్రలో ప్రముఖ నటుడు సముద్రఖని నటించగా, భారతి అనే కీలక పాత్రలో ఐశ్వర్య రాజేష్ కనిపించనున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య జరిగే అధికార పోరాటం కూడా ఈ సిరీస్లో ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
also read: తండ్రి కొడుకుల అరుదైన రికార్డు.. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్
ఈ భారీ వెబ్ సిరీస్ ని తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్పై రాహుల్ తమడా మరియు సైదీప్ రెడ్డి బొర్రా సంయుక్తంగా నిర్మించారు. ప్రశాంత్ రాగతి కథను అందించగా, తాజుద్దీన్ సయ్యద్ పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు. ఈ సిరీస్లో టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపి, రోహిణి, బెనర్జీ, జ్వాలా కోటి, రవివర్మ మరియు రాజా చెంబోలు వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. పీరియాడిక్ డ్రామా కావడంతో 1990ల నాటి వాతావరణాన్ని, హార్బర్ సెటప్ను స్క్రీన్పై తీసుకురావడానికి మేకర్స్ ఎంతో ఖర్చు పెట్టి అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ చేశారు.







