
పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో పెద్ది ఆరు రోజులకే ప్రపంచవ్యాప్తంగా 332.1 కోట్ల గ్రాస్ సాధించట్టుగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు. దీన్ని బట్టి పెద్ది హంగామా ఏ స్థాయిలో కొనసాగుతుందో తెలుస్తుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో, మెగా అభిమానుల కోలాహలంతో కళకళలాడుతున్నాయి.
అయితే ఈ భారీ క్రేజ్ని కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకి తెరలేపారు. సినిమా చూడాలనే పిచ్చో, లేక గుంపులో గోవిందా అంటూ క్యాష్ చేసుకోవాలనే ప్లానో తెలీదు కానీ, ఏకంగా దొంగ నోట్లని మార్కెట్లోకి వదిలి థియేటర్ యాజమాన్యాన్ని బురిడీ కొట్టించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. నరసరావుపేటలోని ప్రముఖ కాసు మల్టీఫ్లెక్స్ థియేటర్ ప్రస్తుతం 'పెద్ది' సినిమా ప్రదర్శనతో కిక్కిరిసిపోతోంది.మూవీకి వస్తున్న విపరీతమైన టాక్ కారణంగా ఉదయం ఆట నుండి రాత్రి ఆట వరకు థియేటర్ వద్ద ప్రేక్షకుల రద్దీ ఊహించని స్థాయిలో ఉంది. టికెట్ కౌంటర్ల వద్ద, ఇంటర్వెల్ సమయంలో స్నాక్స్, పాప్కార్న్ కొనేందుకు జనం ఒకరిపై ఒకరు ఎగబడుతున్నారు. ఈ భారీ రద్దీని, కౌంటర్ సిబ్బంది కంగారుని ఆసరాగా చేసుకున్న కొందరు అపరిచిత వ్యక్తులు తమ వద్ద ఉన్న నకిలీ నోట్లని చలామణి చేయడానికి పక్కా స్కెచ్ వేశారు. టికెట్లు కొనే సాకుతో, క్యాంటీన్లలో తినుబండారాలు తీసుకుంటూ గుట్టుచప్పుడు కాకుండా నకిలీ నోట్లను ఇచ్చి అసలు నోట్లను, చిల్లరను వెనక్కి తీసుకున్నారు.
Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. సినిమాలకి గుడ్ బై చెబుతున్నారా?
కౌంటర్ల వద్ద కలెక్షన్ అంతా పూర్తయి, సిబ్బంది క్యాష్ లెక్కబెడుతున్న సమయంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నోట్ల కట్టల్లో నకిలీ నోట్లు ఉండటం చూసి థియేటర్ సిబ్బంది ఒక్కసారిగా షాక్కి గురయ్యి హడావుడిగా ఉన్న సమయంలో దొంగ నోట్లని గుర్తుపట్టలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటి వెనుక ఉన్న కేటుగాళ్లు ఎవరు అనే కోణంలో థియేటర్ యాజమాన్యం ప్రస్తుతం ముమ్మరంగా ఆరా తీస్తోంది. థియేటర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు.






