గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ #Dragon. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ (Dragon Glimpse) సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ అద్భుతమైన రెస్పాన్స్పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తూ, తన అభిమానులకు మరియు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక భావోద్వేగ లేఖను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
తారక్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో "Thank you" అంటూ ఒక నోట్ను షేర్ చేశారు. "ఇన్నేళ్లుగా మీరు చూపిస్తున్న ఆదరణ, అందిస్తున్న నిరంతర మద్దతు నా ప్రయాణంలో అతిపెద్ద ఆశీర్వాదాలుగా మారాయి. నా ప్రతి దశలోనూ ఇంతటి ప్రేమతో నా వెన్నంటి నిలిచిన నా ప్రియమైన అభిమానులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు."
'డ్రాగన్' గ్లింప్స్కు వస్తున్న రెస్పాన్స్ తమ చిత్ర యూనిట్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని తారక్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలైన శిల్పి దర్శకుడు ప్రశాంత్ నీల్ అని ఆయన కొనియాడారు. గ్లింప్స్ సాధించిన విజయం తమకు మరింత నమ్మకాన్ని ఇచ్చిందని, ప్రేక్షకులకు ఒక మరపురాని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు కష్టపడుతున్నామని చెప్పారు. "ఈ భారీ రెస్పాన్స్ క్రెడిట్ అంతా ఒకే ఒక్కడికి దక్కుతుంది.. ఆయనే నా ప్రశాంత్ నీల్. 'డ్రాగన్' ప్రపంచాన్ని ఆయనే ఊహించారు" అంటూ దర్శకుడి విజన్ను తారక్ అభినందించారు.
చివరగా, తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు సినిమాకు అభినందనలు తెలిపిన తోటి నటీనటులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు మరియు మీడియా మిత్రులందరికీ ఎన్టీఆర్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, తన సంతకంతో కూడిన లేఖను ముగించారు.
'సలార్', 'కేజీఎఫ్' చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఎన్టీఆర్ను సరికొత్త ఊరమాస్ అవతారంలో చూపించబోతున్నట్లు 'డ్రాగన్' గ్లింప్స్ స్పష్టం చేసింది. హీరో, డైరెక్టర్ ఇద్దరి నమ్మకం చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరో సునామీ ఖాయంగా కనిపిస్తోంది. తారక్ షేర్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.





.webp)
