![]() |
![]() |

లెజెండరీ యాక్టర్ శివాజీ గణేశన్ కుమార్తెలు శాంతి, రజ్వీ తమ సోదరులు ప్రభు, రామ్కుమార్పై చెన్నై హైకోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరూ నకిలీ వీలునామాతో తమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారనీ, వారి కుమారుల పేర్లపై ఆ ఆస్తులను బదిలీ చేశారనీ ఆ ఫిర్యాదులో ఆరోపించారు. తమ తల్లి ద్వారా ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి తమ సోదరులు సహకరించలేదని కూడా శాంతి, రజ్వీలు ఆరోపించారు. 2005లో అమలులోకి వచ్చిన హిందూ వారసత్వ చట్టాన్ని ప్రస్తావించిన శివాజీ గణేశన్ కుమార్తెలు, తమ తండ్రి ఆస్తిపై ఆయన కుమార్తెలుగా తమకూ హక్కు ఉందనీ, ఆస్తి విభజన సక్రమంగా జరిగేలా ఉత్తర్వులివ్వాలని కోర్టును కోరారు.
నడిగర్ తిలగమ్గా పేరు గాంచిన శివాజీ గణేశన్ తమిళ సినిమాను ఏలిన అగ్ర నటుల్లో ఒకరు. ఆయన నలుగురు పిల్లల్లో ప్రభు నటునిగా తండ్రి వారసత్వాన్ని కొనసాగించి, పాపులర్ అయ్యాడు. ఆయన 100కు పైగా సినిమాల్లో నటించగా, రామ్కుమార్ సైతం కొన్ని సినిమాల్లో నటించి, నిర్మాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అనారోగ్యంతో 2001లో శివాజీ కన్నుమూశారు. తమిళనాడు వ్యాప్తంగా ఆయనకు రూ. 270 కోట్ల విలువచేసే ఆస్తులున్నాయి. గత 21 సంవత్సరాలుగా శివాజీ కుటుంబం ఒక్కతాటిపైనే ఉంటూ వచ్చింది. ఆయన ఆస్తులను నలుగురు పిల్లలూ మేనేజ్ చేస్తూ వచ్చారు.
![]() |
![]() |