Home  »  News  »  ‘సాయి పల్లవికి డబ్బింగ్‌ చెప్పేది నేనే’.. ఇదో రకమైన మోసమా?

Updated : Sep 19, 2024

ఇటీవలి కాలంలో యూ ట్యూబ్‌ ఛానల్స్‌ ఎంత చురుకుగా పనిచేస్తున్నాయంటే.. ఏ చిన్న ఇష్యూ జరిగినా దాన్ని వెంటనే తమ ఛానల్‌లో ఓ ప్రోగ్రామ్‌ చేసెయ్యాలి అనే ఆరాటంలో నిజానిజాలు తెలుసుకోకుండా రంగంలోకి దూకుతున్నారు. అయితే చాలా వరకు కలెక్ట్‌ చేసిన న్యూస్‌ కరెక్టే అయినా కొన్ని సార్లు మాత్రం తప్పులో కాలేస్తున్నారు. అలాంటి ఓ విచిత్రమైన అంశం ఈమధ్య హీరోయిన్‌ సాయి పల్లవి విషయంలో జరిగింది. సాయిపల్లవికి తెలుగు రాకపోయినా, నేర్చుకొని తన క్యారెక్టర్‌కి తానే డబ్బింగ్‌ చెప్పుకుంటోంది. దాదాపు ఏడు సంవత్సరాల క్రితం విడుదలైన ఫిదా చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్స్‌కి విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. అంతేకాదు, డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు స్టూడియోలో చేసిన ఓ వీడియో కూడా అప్పట్లో బాగా పాపులర్‌ అయ్యింది. 

ఇదిలా ఉంటే.. సాయి పల్లవికి డబ్బింగ్‌ చెప్పింది తానేనంటూ ఆద్య హనుమంతు అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. సాధారణంగా పాటల రికార్డింగ్‌కి సంబంధించి ఒక ట్రాక్‌ సింగర్‌తో ఆ పాటను పాడిస్తారు. ఒరిజినల్‌ సింగర్‌ ఆ ట్రాక్‌ విని తన స్టైల్‌లో పాడేందుకు ట్రై చేస్తారు. సాయిపల్లవికి తానే డబ్బింగ్‌ చెబుతాను అంటూ వచ్చిన వ్యక్తి కూడా మొదట ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను తెలుగులో ట్రాక్‌ డబ్బింగ్‌ చెప్పేవాడినని తెలియజేశాడు. అంతేకాదు, కన్నడలో డబ్బింగ్‌ వెర్షన్స్‌కి సాయిపల్లవికి డబ్బింగ్‌ చెప్తానంటున్నాడు. ట్రాక్‌ సింగర్‌లా తాను ట్రాక్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ అనేది ఎస్టాబ్లిష్‌ చేసుకున్నాడు. కానీ, కొన్ని యూ ట్యూబ్‌ ఛానల్స్‌ మాత్రం అతనే ఒరిజినల్‌గా డబ్బింగ్‌ చెబుతాడంటూ థంబ్‌ నెయిల్స్‌ పెట్టడంతో ఈ విషయం బాగా ప్రచారంలోకి వచ్చింది. 

దీంతో మిగతా యూ ట్యూబ్‌ ఛానల్స్‌ అన్నీ అతన్ని తీసుకొచ్చి స్టూడియోల్లో కూర్చోబెడుతున్నారు. అనుకోకుండా వచ్చిన పబ్లిసిటీని మరింత పెంచుకునేందుకు ఒక అడుగు ముందుకు వేసి తానే ఒరిజినల్‌గా డబ్బింగ్‌ చెబుతున్నానంటూ ఆ క్రెడిట్‌ తీసేసుకున్నాడు హనుమంతు. నిజానికి అతను ఇంటర్వ్యూల్లో చెప్పిన డైలాగ్స్‌కి, సినిమాలో మనం విన్న సాయిపల్లవి వాయిస్‌కి ఎక్కడా పొంతన లేదు. అయినా దాన్నే ప్రొజెక్ట్‌ చేస్తూ అతనికి మరింత పబ్లిసిటీ ఇచ్చే పనిలో ఉంది మీడియా. దీనికి తోడు కొన్ని ఛానల్స్‌లో కూడా అతన్ని హైలైట్‌ చెయ్యడం విచిత్రంగా అనిపిస్తుంది. 

గత కొంతకాలంగా సాయిపల్లవి డబ్బింగ్‌ విషయంలో ఇంత రచ్చ జరుగుతున్నా.. సాయిపల్లవిగానీ, ఆమె చేసిన సినిమాలకు సంబంధించిన యూనిట్‌ మెంబర్స్‌గానీ ఈ విషయంలో ఎలాంటి కామెంట్‌ చేయకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. అంతేకాదు, మిగతా డబ్బింగ్‌ ఆర్టిస్టులు కూడా దీనిపై ఇప్పటివరకు నోరు విప్పలేదు. వాళ్ళ మౌనం చూస్తుంటే ఆద్య హనుమంతు అనే వ్యక్తి చెప్పేది నిజమేనా.. ఇంతకాలం తానే డబ్బింగ్‌ చెబుతున్నానంటూ సాయిపల్లవి ప్రేక్షకుల్ని మోసం చేస్తోందా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఇప్పటికే అతని ఇంటర్వ్యూలు యూ ట్యూబ్‌లో చాలా వచ్చాయి. సోషల్‌ మీడియాలో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఆద్య హనుమంతు అనే వ్యక్తి అబద్ధం చెబుతున్నాడని, సినిమాలో మనకు వినిపిస్తున్న సాయి పల్లవి వాయిస్‌కి, అతను ఇంటర్వ్యూల్లోని అతని వాయిస్‌కి సంబంధమే లేదని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. డబ్బింగ్‌ పేరుతో ఇదో రకమైన మోసం జరుగుతోంది అంటూ రకరకాలుగా కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.