![]() |
![]() |

అన్ని సినిమాలకు ఒకే విధంగా టిక్కెట్ ధరలు, ఇతర నిబంధనలు వర్తిస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ సినిమాకీ మినహాయింపులు ఉండవనీ, అదేవిధంగా ప్రత్యేకంగా పరిగణించడం ఉండదనీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని చెప్పారు. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన చిత్రాల్లో ఒకటైన 'ఆర్ఆర్ఆర్' మూవీ జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా వేలాది థియేటర్లలో విడుదలవుతోంది. యస్.యస్. రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీని ఆంధ్రప్రదేశ్లో రికార్డు ధరలకు అమ్మారు నిర్మాత డీవీవీ దానయ్య.
టిక్కెట్ ధరలను తగ్గించడం, నియమ నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండటం వల్ల బయ్యర్ల పెట్టిన డబ్బు తిరిగి రావడం అనేది అసాధ్యం. 'ఆర్ఆర్ఆర్'కు ఏవైనా మినహాయింపులు ఇస్తారా?.. అనే ప్రశ్నకు అన్ని సినిమాలకు ప్రభుత్వ నిబంధనలు ఒకేలా ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.
'ఆర్ఆర్ఆర్' విడుదలయ్యే లోగా ప్రభుత్వం టికెట్ ధరలను పెంచకపోయినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఆ సినిమాకూ, దాని తర్వాత విడులవుతున్న 'రాధే శ్యామ్' మూవీకీ క్లిష్ట పరిస్థితులు తప్పవు. 'అఖండ', 'పుష్ప' సినిమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించింది. అందువల్ల మెజారిటీ థియేటర్లలో ఏ సెంటర్ల నుంచి సీ సెంటర్ల దాకా ఒకే విధంగా 100 రూపాయల టికెట్లను అమ్మారు. అయితే అధికారికంగానే నగరాల్లో 150 రూపాయలు.. బీ, సీ సెంటర్లలో 100 రూపాయలు టిక్కెట్ ధరలు ఉండాలని ఫిల్మ్ ఇండస్ట్రీ కోరుతోంది.
ఆలియా భట్, అజయ్ దేవ్గణ్, శ్రియ, సముద్ర కని, రే స్టీవెన్సన్, అలీసన్ డూడీ కీలక పాత్రలు చేసిన 'ఆర్ఆర్ఆర్' మూవీ తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజవుతోంది.
![]() |
![]() |