![]() |
![]() |

"మనం చెట్లను కాపాడితే... చెట్లు మనల్ని కాపాడతాయి" అనే సిద్దాంతంతో చెట్లు నాటడానికే తన జీవితాన్ని అంకితం చేసి, "చెట్ల రామయ్య" అలియాస్ "వనజీవి రామయ్య"గా తన జన్మను ధన్యం చేసుకుని, భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక "పద్మశ్రీ" పురస్కారం పొందిన దరిపల్లి రామయ్య జీవితానికి "వనజీవి రామయ్య" పేరుతో దృశ్యరూపం ఇచ్చారు నూతన నిర్మాత బూసం రవీంద్రనాధ్.
"వృక్షో రక్షతి రక్షిత" అనే ట్యాగ్ లైన్ తో నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వంలో బి. ఆర్. మూవీస్ బ్యానర్ పై రవీంద్రనాధ్ నిర్మించిన ఈ 40 నిమిషాల నిడివి కలిగిన లఘు చిత్రం... షార్ట్ ఫిలిమ్స్ కేటగిరీలో ఫస్ట్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ గా తెలంగాణ ప్రభుత్వం నుంచి గద్దర్ అవార్డు దక్కించుకుంది. 5 లక్షల నగదు బహుమతి కూడా అందుకుని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించింది.
నిర్మాతగా తన తొలి ప్రయత్నమే ఫలప్రదం కావడంతో... త్వరలో రెండో చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు బూసం రవీంద్రనాధ్. కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన రవీంద్రనాధ్ స్వతహాగా స్థిరాస్తి వ్యాపారి. సినిమాలంటే చిన్నప్పటి నుంచి మహా ఇష్టం. ఆ ఇష్టంతోనే "వనజీవి రామయ్య" చిత్రంలో ఒక చిన్న పాత్ర సైతం పోషించారు.
ప్రస్తుతం తన రెండో చిత్రం కోసం కథాచర్చలు జరుపుతున్న రవీంద్ర త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్ కి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. "వనజీవి రామయ్య"గా టైటిల్ రోల్ తో మెప్పించిన సీనియర్ నటుడు బ్రహ్మాజీతోపాటు ఈ చిత్రం రూపకల్పనలో దర్శకనిర్మాతలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.

గద్దర్ అవార్డు అందుకున్న అనంతరం మెగాస్టార్ చిరంజీవి నుంచి సైతం ప్రశంసను పొందడం, అంతకుముందు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనకు నోచుకోవడం తనకు ఎంతో బలాన్నిచ్చాయని రవీంద్రనాధ్ తెలిపారు. చిరంజీవి గారిని కలిసినప్పుడు, "సర్ మీతో "ఠాగూర్" లాంటి సినిమా చేయాలన్నది నా జీవితాశయమని చెప్పినప్పుడు... "గట్టిగా అనుకో. తప్పక నెరవేరుతుంది" అని ఆయన చిరునవ్వుతో స్పందించడం తనకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చిందని రవీంద్ర పేర్కొన్నారు.
![]() |
![]() |