![]() |
![]() |

సినిమాల్లో చూపించే మంచిని ఫాలో అయ్యేవాళ్ళు పెద్దగా ఉండరు కానీ, చెడుని మాత్రం కొందరు ఫాలో అవుతుంటారు. 'రాజు వెడ్స్ రాంబాయి'(Raju Weds Rambai) సినిమాని తలపిస్తూ తాజాగా హైదరాబాద్(Hyderabad)లో జరిగిన ఓ ఘటన కంటతడి పెట్టిస్తుంది.
గతేడాది చిన్న సినిమాగా విడుదలైన 'రాజు వెడ్స్ రాంబాయి' పెద్ద విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేని తండ్రి.. అత్యంత కిరాతకంగా హెచ్ఐవీ పాజిటివ్ రక్తం ఉన్న ఇంజెక్షన్ ను ఆమెకు ఇస్తాడు. మూవీ చూసిన చాలామందిని ఈ సీన్ డిస్టర్బ్ చేసింది. ఇది చాలా ఏళ్ళ క్రితం జరిగిన రియల్ ఇన్సిడెంట్ అని మూవీ టీమ్ చెప్పినప్పటికీ.. దీనిని అందరూ జీర్ణించుకోలేకపోయారు.
అయితే 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా వచ్చిన తర్వాత.. ఇటీవల ఈ తరహా ఘటనలు నిజంగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్ లో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. తనతో పెళ్ళికి ఒప్పుకోలేదని, ఒక యువతికి బలవంతంగా హెచ్ఐవీ ఇంజెక్షన్ ఇచ్చాడో కిరాతక ప్రియుడు. ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి ఇప్పటికే జైలులో ఉండగా.. ఆ ఇంజెక్షన్ వల్ల తన ఆరోగ్యానికి ఏమవుతుందోనన్న భయంతో, మనస్తాపంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్లోని అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప నివాసి అయిన రమణి అనే యువతికి, మనోహర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని రమణిపై ఒత్తిడి తెచ్చాడు మనోహర్ . అయితే, మనోహర్ అప్పటికే హెచ్ఐవీ వ్యాధితో బాధపడుతున్నాడన్న విషయం రమణికి తెలిసింది. దీంతో అతనితో పెళ్లికి నిరాకరించింది.
తనతో పెళ్ళికి ఒప్పుకోలేదన్న కోపంతో రమణిపై పగ పెంచుకున్నాడు మనోహర్. గత నెల 11వ తేదీన రమణి ఇంటికి వెళ్లి, ఆమెతో గొడవకు దిగాడు. ఆ సమయంలో తన దగ్గర ఉన్న హెచ్ఐవీ ఇంజెక్షన్ను రమణికి బలవంతంగా ఇచ్చాడు. ఈ దారుణమైన చర్య తర్వాత మనోహర్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం అతను జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
ఒకవైపు హెచ్ఐవీ రక్తాన్నితన శరీరంలోకి ఎక్కించడం, మరోవైపు సమాజంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితుల గురించి రమణి తీవ్రంగా ఆందోళన చెందింది. ఈ ఘటన జరిగినప్పటి నుండి ఆమె మనస్తాపానికి గురైంది. ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత తన ప్రాణంపై గ్యారెంటీ లేదన్న భయం కూడా ఆమెను కుంగదీసింది. ఈ క్రమంలో పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని తన నివాసంలోనే తాజాగా ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడీ వార్త అందరిచేత కంటతడి పెట్టిస్తుంది.
![]() |
![]() |