గత ఏడాది నవంబర్లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్లో చేరిన టాలీవుడ్ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న ఆయన ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అలాగే తన అనారోగ్య సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
'బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇవ్వడం ద్వారా మీరు చూపిన శ్రద్ధకు పట్ల నేను చాలా సంతోషిస్తున్నాన'ని ఆయన అన్నారు. "మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు, వైద్యఖర్చులను తీర్చడానికి ఆర్థిక సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించారు. ఆ కష్ట సమయాల్లో మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చింది" అని ఆయన అన్నారు.
Also read: 'బంగార్రాజు' విజయం వెనుక సీఎం జగన్ ఉన్నారు!
జగన్ చూపిన ఈ శ్రద్ధ ఆయనకు కళాకారుల పట్ల, వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసిందనీ, ప్రజల పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుందని కైకాల అభిప్రాయపడ్డారు. "అనారోగ్యం పాలైనప్పటి నుంచి అండగా ఉన్నందుకు నేను మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నా", అని చెబుతూ ఆయన నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేశారు.
Also read: ధనుష్-ఐశ్వర్య ఎందుకు విడిపోయారు?
తాను సంతకం చేయలేక పోవడంతో, తన కుమారుడు ఈ కృతజ్ఞతా లేఖపై సంతకం చేశారని ఆయన వెల్లడించారు. అంతే కాక తనకు బాగోనప్పుడు తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. అలాగే అభిమానుల ప్రార్థనలే తనని మళ్ళీ మాములు మనిషిని చేశాయని ఆయన అన్నారు.