Home  »  News  »  ‘భారతీయుడు 2’ టీమ్‌కి కోర్టు నోటీసులు.. 12కి రిలీజ్‌ ఉంటుందా? లేదా?

Updated : Jul 10, 2024

లోకనాయకుడు కమల్‌హాసన్‌ హీరోగానే కాదు, నిర్మాతగా కూడా ఎన్నో వైవిధ్యమైన సినిమాలు నిర్మించారు. గతంలో సంగతి ఎలా ఉన్నా చాలా కాలంగా కమల్‌ నిర్మించిన కొన్ని సినిమాలు వివాదాలకు తెరతీశాయి. అంతేకాదు, వివిధ కారణాలతో సినిమా రిలీజ్‌ ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా కమల్‌ ‘భారతీయుడు 2’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి నిర్మాత అతను కాకపోయినా సరిగ్గా రిలీజ్‌ టైమ్‌లో ఒక సమస్య వచ్చింది. దాని వల్ల సినిమా రిలీజ్‌ అవుతుందా, లేదా అనే ప్రశ్న అందరిలోనూ మొదలైంది. 

విషయమేమిటంటే.. ‘భారతీయుడు 2’ రిలీజ్‌ని ఆపాలంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు. కేసును స్వీకరించిన కోర్టు జూలై 11లోగా వివరణ ఇవ్వాలని టీమ్‌కి నోటీసులు జారీ చేసింది. ఈ సినిమాకి రిలీజ్‌ సమస్య రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా సినిమా రిలీజ్‌కి ముందు ఫైనాన్షియల్‌ సమస్యలు ఎదురైతే రిలీజ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, ఇక్కడ వచ్చిన సమస్య వేరు. కమల్‌హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో ‘భారతీయుడు’ చిత్రం వచ్చింది. ఒక కొత్త పాయింట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. దాదాపు 28 సంవత్సరాల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘భారతీయుడు 2’ నిర్మాణ సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కొంతకాలం ఈ సినిమా షూటింగ్‌ కూడా ఆగిపోయింది. అన్నింటినీ అధిగమించి సినిమాను పూర్తి చేశారు. జూలై 12న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ సమయంలో చిత్ర యూనిట్‌ కోర్టు మెట్లు ఎక్కాల్సి రావడం నిజంగా దురదృష్టమే. 

రాజేంద్రన్‌ అనే రచయిత రాసిన ‘మర్మకళ’ పుస్తకం ఆధారంగా ‘భారతీయుడు’ చిత్రంలోని కొన్ని సీన్స్‌ను చిత్రీకరించారు. సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్‌లో అది బ్రిటీష్‌ కాలంనాటి కథగా చూపించారు. ఆ సమయంలో మర్మకళకు సంబంధించిన విద్యను నేర్చుకుంటాడు భారతీయుడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ‘భారతీయుడు2’ చిత్రంలో మర్మకళను ప్రదర్శిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో అది సమాజానికి తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం ఉందని రాజేంద్రన్‌ వాదన. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సమయంలోనే దర్శకనిర్మాతల దృష్టికి తీసుకెళ్ళారు రాజేంద్రన్‌. అయినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది అంటున్నారాయన. 

రాజేంద్రన్‌ పిటీషన్‌ను స్వీకరించిన మధురై కోర్టు.. కమల్‌హాసన్‌కు, డైరెక్టర్‌ శంకర్‌కు, నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. జూలై 11లోగా వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. సినిమా రిలీజ్‌కి రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. కాబట్టి రిలీజ్‌కి ఒకరోజు ముందుగానే చిత్ర యూనిట్‌ వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాజేంద్రన్‌ పిటిషన్‌లో పేర్కొన్న అంశాలకు యూనిట్‌ ఎలాంటి వివరణ ఇస్తుందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కేసు విషయంలో ‘భారతీయుడు 2’ టీమ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైనే సినిమా రిలీజ్‌ ఆధారపడి ఉంది. మరోపక్క జూలై 12కి సినిమా రిలీజ్‌ అవ్వడం కష్టమేనన్న అభిప్రాయాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.