![]() |
![]() |

ఇదివరకు తెలుగు, తమిళ సినిమా రంగాల్లో అగ్ర నటిగా వెలిగిన మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూశారు. ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఇబ్బందులు పడుతూ వచ్చారు. దాని నిమిత్తమై హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ వచ్చారని సమాచారం. "మీనా భర్త విద్యాసాగర్ ఆకస్మిక మృతి వార్త వినగానే షాక్కు గురయ్యాను" అని మంగళవారం రాత్రి నటుడు శరత్కుమార్ ట్వీట్ చేశారు.
బెంగళూరుకు చెందిన ఐటీ నిపుణులైన విద్యాసాగర్ను 2009లో మీనా వివాహం చేసుకున్నారు. వారికి నయనిక అనే కుమార్తె ఉంది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన మీనా, 1990, 2000 దశకాల్లో తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో టాప్ హీరోయిన్గా రాణించారు. ఆ కాలంలో రెండు భాషల్లోని అగ్ర హీరోలందరి సరసనా ఆమె నటించారు.
తెలుగులో ఇటీవల 'దృశ్యం', 'దృశ్యం 2' చిత్రాల్లో వెంకటేశ్ భార్యగా నటించి మెప్పించారు. 'చంటి' సినిమా నుంచీ ఆ ఇద్దరిదీ సూపర్హిట్ పెయిర్గా పేరు తెచ్చుకుంది. వెంకటేశ్ కూడా ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలిపారు. "విద్యాసాగర్ గారి మృతి అత్యంత విషాదకరం, దిగ్భ్రాంతికరం! మీనా గారికి, ఆమె మొత్తం కుటుంబానికీ నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ కష్ట కాలం నుంచి బయటపడేందుకు వారికి శక్తి చేకూరాలని ఆశిస్తున్నాను" అని ఆయన ట్వీట్ చేశారు.
![]() |
![]() |