Home  »  News  »  సుప్రీంకోర్టులో బండ్ల గణేష్‌కు గట్టి షాక్.. ఆస్తి వేలం కేసులో అసలు నిజాలివే.!

Updated : Jul 23, 2026

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు ఆస్తి వేలం వివాదంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ షేక్‌పేట ప్రాంతంలో ఉన్న ఆస్తిని బ్యాంక్ వేలం వేయడాన్ని సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించింది. దీంతో ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పే యథాతథంగా అమల్లో ఉండనుంది.

ఈ వివాదానికి ప్రధాన మూలం శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్ లిమిటెడ్‌కు సంబంధించిన బ్యాంక్ రుణాలు. ఆ సంస్థ తీసుకున్న రుణాలకు బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు హామీదారులుగా వ్యవహరించారు. అయితే కాలక్రమేణా సదరు సంస్థ రుణ బకాయిలను సక్రమంగా చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. సర్ఫేసీ (SARFAESI) చట్టం కింద 2019వ సంవత్సరంలోనే బ్యాంక్ అధికారులు హామీదారుల ఆస్తిని తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత 2022లో నిర్వహించిన బహిరంగ వేలంలో ఈ ఆస్తిని సుమారు రూ. 8.51 కోట్లకు యూనియన్ బ్యాంక్ విక్రయించింది.

బ్యాంక్ జరిపిన ఈ వేలం ప్రక్రియను సవాలు చేస్తూ బండ్ల గణేష్ డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT)ను ఆశ్రయించారు. విచారణ జరిపిన డీఆర్టీ మొదట బ్యాంక్ చేపట్టిన వేలాన్ని రద్దు చేస్తూ బండ్ల గణేష్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ యూనియన్ బ్యాంక్ ఈ తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాలు చేసింది. విచారణ సమయంలో బండ్ల గణేష్ తరఫు న్యాయవాదులు వాదిస్తూ, సదరు కంపెనీపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో దివాళా పరిష్కార ప్రక్రియ (Insolvency) కొనసాగుతున్నందున వేలం ఎంతమాత్రం చెల్లదని పేర్కొన్నారు. అయితే బ్యాంక్ తరఫు లాయర్లు మాత్రం వేలం వేసిన ఆస్తి కంపెనీది కాదని, రుణాలకు వ్యక్తిగత హామీ ఇచ్చిన వ్యక్తుల సొంత ఆస్తి అని, కాబట్టి సర్ఫేసీ చట్టం ప్రకారం బ్యాంక్ చర్యలు పూర్తిగా చట్టబద్ధమేనని గట్టిగా వాదించారు. హైకోర్టు బ్యాంక్ వాదనతో ఏకీభవించి డీఆర్టీ తీర్పును రద్దు చేసింది.

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. 

ఈ పరిణామంతో తన ఆస్తులన్నీ పోయాయంటూ వస్తున్న పుకార్లపై బండ్ల గణేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరణ ఇచ్చారు. "కొందరు నా మొత్తం ఆస్తి పోయిందని అపోహ పడుతున్నారు, అది పూర్తిగా అవాస్తవం. ఈ కేసు కేవలం షేక్‌పేటలోని అపర్ణా సినార్ వ్యాలీలో ఉన్న 500 గజాల ఒక్క ప్రాపర్టీకి మాత్రమే పరిమితమైనది. 2022లో రూ. 8.51 కోట్లకు యూనియన్ బ్యాంక్ అమ్మిన ఆ ఒక్క ఆస్తి విక్రయాన్నే నేను చట్టపరంగా ప్రశ్నించాను" అని స్పష్టం చేశారు. 

అంతేకాకుండా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తుది తీర్పును తాను సంపూర్ణంగా గౌరవిస్తున్నానని, భారతీయ న్యాయవ్యవస్థపై తనకు పరిపూర్ణ విశ్వాసం ఉందని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

 

 

Bandla Ganesh, Property Auction, Supreme Court, Verdict

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.