![]() |
![]() |

అల్లు అర్జున్(Allu Arjun).. ఇది పేరు కాదు బ్రాండ్ అనే రీతిలో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తనకి ఆ బ్రాండ్ వచ్చేలా చేసిన సినిమా కోసం, ప్రేక్షకుల కోసం అత్యాధునిక హంగులతో కూడిన మల్టి ప్లెక్స్ లని నిర్మిస్తున్నాడు. ఈ కోవలోనే హైదరాబాద్లోని అమీర్పేట్లో, కోకాపేటలో 'AAA' సినిమాస్ పేరుతో అందుబాటులోకి తెచ్చాడు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్(VIzag)లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మల్టి ప్లెక్స్ కి సరికొత్త ప్రణాళికల సిద్ధమైంది. దక్షిణాదిలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, దాదాపు 13 ఎకరాల భారీ విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న వైజాగ్ 'ఇన్ఆర్బిట్ మాల్' లో ఈ సరికొత్త ఏఏఏ సినిమాస్ మల్టీప్లెక్స్ ఏర్పాటు కానుంది. ఈ మల్టీప్లెక్స్కు సంబంధించిన భూమి పూజా కార్యక్రమం తాజాగా అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ పూజా కార్యక్రమంలో అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెతో పాటు ఏషియన్ సినిమాస్ భాగస్వాములైన నారంగ్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొని ఈ ప్రతిష్టాత్మక నిర్మాణ పనులకి ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ వేడుకకి విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్, ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ చైర్మన్ భరత్ భూషణ్, ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ సరాఫ్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, శ్రీమతి శ్యామల దీపక్తో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై అల్లు అర్జున్ కుటుంబానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
వైజాగ్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్న ఈ సరికొత్త ప్రీమియం మల్టీప్లెక్స్లో మొత్తం ఎనిమిది అత్యాధునిక స్క్రీన్లని ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని అందించడమే లక్ష్యంగా 4K ప్రొజెక్షన్ సిస్టమ్లు, సరికొత్త డాల్బీ అట్మోస్ ఆడియో టెక్నాలజీతో ప్రతి స్క్రీన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. భారీ స్క్రీన్లు, కంటికి మైమరపించే విజువల్ క్వాలిటీ, గుండెల్లో ప్రతిధ్వనించే శక్తివంతమైన ఆడియో సిస్టమ్తో ప్రతి ఒక్క మూవీ లవర్ ఇక్కడ సినిమా చూస్తే 'తగ్గేదేలే' అనేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, విలాసవంతమైన ఇంటీరియర్స్, అత్యంత సౌకర్యవంతమైన లగ్జరీ పుష్-బ్యాక్ మరియు రెక్లైనర్ సీటింగ్, నోరూరించే అత్యాధునిక ఫుడ్ కోర్ట్స్ వంటి ఆధునిక వసతులు ఈ మల్టీప్లెక్స్ సొంతం.

![]() |
![]() |