![]() |
![]() |

జీవితంలో ఎదురయ్యే కొన్ని కష్టాలు మనుషులను మానసికంగా, శారీరకంగా కుంగదీస్తాయి. కానీ ధైర్యంతో పాటు సరైన సమయంలో తోడు దొరికితే ఎంతటి మహమ్మారినైనా జయించవచ్చని నిరూపించింది అనంతపురం జిల్లాకు చెందిన స్వప్న (Swapna) అనే యువతి. తాను పదో తరగతి చదువుతున్న సమయంలో ఊహించని విధంగా బోన్ క్యాన్సర్ బారిన పడింది. ఆ వయసులో క్యాన్సర్ అనే పేరు వినడమే ఓ పెద్ద షాక్. అనంతపురంలోని పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా, ఎక్కడా ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదు. జీవితంపై ఆశలు కోల్పోతున్న తరుణంలో, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆమెను హైదరాబాద్లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు రిఫర్ చేశారు. అదో కొత్త ఆశల ముగింపునకు ప్రారంభంలా నిలిచింది. (Basavatarakam)
అయితే, బసవతారకం ఆసుపత్రికి వచ్చిన తర్వాత కూడా స్వప్న పోరాటం అంత సులువుగా సాగలేదు. వైద్యులు ఆమెకు సుదీర్ఘంగా 6 నెలల పాటు కీమోథెరపీ అందించారు. ఆ 6 నెలల కఠినమైన కీమో సెషన్స్ తర్వాత కూడా ఆమె కోలుకోలేకపోయింది. క్యాన్సర్ తీవ్రత తగ్గకపోవడంతో, వైద్యులు ఆమెకు సర్జరీ చేయాలని నిర్ణయించారు. కానీ ఆ సమయంలో ఆపరేషన్ చేయడానికి కావాల్సిన ఆర్థిక వనరులు, సరైన మార్గదర్శకత్వం లేక ఆ కుటుంబం తీవ్ర ఆందోళనలో పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో స్వప్న జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతం జరిగింది.
NBK హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అనంతపురం జగన్ ద్వారా ఈ విషయం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) దృష్టికి వెళ్ళింది. స్వప్న పరిస్థితిని తెలుసుకున్న బాలకృష్ణ ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా రంగంలోకి దిగారు. స్వప్న కుటుంబ సభ్యులతో మాట్లాడి, బసవతారకం ఆసుపత్రిలో ఆమెకు తక్షణమే అత్యుత్తమ వైద్యం అందేలా స్వయంగా అడ్మిషన్ చేయించారు. నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవ, పర్యవేక్షణలో బసవతారకం ఆసుపత్రి వైద్య బృందం స్వప్నకు అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసింది. ఆసుపత్రిలో ఉన్న కాలమంతా డాక్టర్ కొడాలి హరిత గారు స్వప్నను సొంత బిడ్డలా దగ్గరుండి చూసుకున్నారు. ఆమె అందించిన ఆప్యాయత, ధైర్యం స్వప్నను మానసికంగా ఎంతో బలాన్ని ఇచ్చాయి.
తాజాగా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ (25 వసంతాలు) వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం వేదికపై స్వప్న ఆరోగ్యంగా నిలబడి మాట్లాడింది. ఆ వేదికపై ఆమె మాట్లాడుతూ, "నేను ఈ రోజు ఇలా మీ ముందు నవ్వుతూ ఉన్నానంటే దానికి కారణం కేవలం బాలకృష్ణ గారు, బసవతారకం ఆసుపత్రి మాత్రమే. బాలకృష్ణ గారు లేకపోతే నేను ఈ రోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదు. ఆయన వల్లే నాకు పునర్జన్మ వచ్చింది. నేను ఎప్పటికీ బాలకృష్ణ గారి రుణం తీర్చుకోలేను" అంటూ భావోద్వేగానికి లోనైంది. క్యాన్సర్ లాంటి మహమ్మారిని జయించిన స్వప్న ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకుని, ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా తన జీవితాన్ని గడుపుతోంది. ఒకప్పుడు మంచానికే పరిమితమైన ఒక సాధారణ అమ్మాయి, ఈ రోజు క్యాన్సర్ విజేతగా నిలిచి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.
![]() |
![]() |