![]() |
![]() |

ఒక మూవీ సెట్స్ పైకి వెళ్లిన తర్వాత స్క్రిప్ట్లో మార్పులు జరగడం, కొన్ని సన్నివేశాలని మళ్లీ చిత్రీకరించడం చాలా సహజమైన విషయమే. ఈ కోవలోనే విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' (హౌస్ నెం. 47) చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
మేకర్స్ కథలో కొన్ని కీలక మార్పులు చేయడమే కాకుండా, ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్లకి రీషూట్లు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ భారీ మార్పుల వెనుక ఒక బలమైన కారణం ఉందట. ఇటీవల థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించిన ఒక సినిమా కథకి,త్రివిక్రమ్ రూపొందిస్తున్న 'ఆదర్శ కుటుంబం' కథకి చాలా పోలికలు ఉన్నాయని చిత్ర బృందం గుర్తించింది. రెండు సినిమాల ప్రధాన లైన్ ఒకేలా ఉందనే విషయం యూనిట్ దృష్టికి రావడంతో, మేకర్స్ వెంటనే అలెర్ట్ అయ్యారు. ఒకే రకమైన కథతో వస్తే ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం కష్టమని భావించిన దర్శకుడు త్రివిక్రమ్, వెంటనే స్క్రిప్ట్లో మార్పులు చేయడం ప్రారంభించారట. ఎక్కడా పాత సినిమా షేడ్స్ కనిపించకుండా, సరికొత్త ట్విస్టులతో కథని మరింత ఆసక్తికరంగా మారుస్తున్నట్లు తెలుస్తోంది.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. గతంలో త్రివిక్రమ్ , వెంకటేష్ కాంబోలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' వంటి సినిమాలు టాలీవుడ్లో టైమ్లెస్ క్లాసిక్స్గా నిలిచాయి. వాటికి త్రివిక్రమ్ కేవలం రచయితగా మాత్రమే పనిచేశాడు. కానీ ఈసారి ఏకంగా ఆయనే మెగాఫోన్ పట్టి డైరెక్ట్ చేస్తుండటంతో 100 శాతం వినోదం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే, ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకూడదనే ఉద్దేశంతోనే త్రివిక్రమ్ రీషూట్లకు వెనుకాడటం లేదట. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also read: sing geetham: సింగ్ గీతం బాక్సాఫీస్ కలెక్షన్ల సునామీ
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్లోకి మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ విలన్ పాత్ర కోసం ఎంట్రీ ఇచ్చారనే వార్తలు వైరల్ అయ్యాయి. కథ ప్రకారం 1980ల నాటి ఫ్యామిలీ ఎమోషన్స్, త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు, క్లీన్ కామెడీ ఈ సినిమాలో హైలైట్గా నిలవనున్నాయి. ప్రస్తుతానికైతే స్క్రిప్ట్ మార్పుల కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ కొద్దిగా మారే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే చిత్ర యూనిట్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. మరి మాటల మాంత్రికుడు ఈ 'ఆదర్శ కుటుంబం'తో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నారో చూడాలి.
![]() |
![]() |