![]() |
![]() |

కారణాలు తెలియదు గాని ప్రస్తుత రోజుల్లో కొత్త సినిమా చూడాలంటే సామాన్య ప్రేక్షకుడికి మల్టీప్లెక్స్ , సింగిల్ స్క్రీన్స్లో మూవీ చూడటం పెద్ద ఆర్థిక భారంగా మారింది. ఇక కుటుంబం మొత్తం కలిసి వెళ్లాలంటే భారీ ఖర్చు అవుతుంది. ఇలాంటి తరుణంలో సినీ ప్రేమికులకి ఊరటనిచ్చేలా బాలీవుడ్ మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. వర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్పాయ్ సరికొత్త ఎకనామిక్ థ్రిల్లర్ చిత్రం 'గవర్నర్(Governor). ఈ మూవీకి సంబంధించిన మొదటి 25,000 టికెట్లని కేవలం 50 రూపాయిలకే అందిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
గవర్నర్ మూవీ ఈ రోజే థియేటర్స్ లోకి రానుంది. ఇదే రోజు ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వస్తున్న 'మై వాపస్ ఆవుంగా', కంగనా రనౌత్ 'భారత్ భాగ్య విధాత', విక్రమ్ భట్ హారర్ మూవీ 'హాంటెడ్ 3డీ: ఎకోస్ ఆఫ్ ది పాస్ట్' చిత్రాలు వస్తున్నాయి. దీంతో 'గవర్నర్' ఈ తీవ్రమైన పోటీని తట్టుకుని, ప్రేక్షకులని థియేటర్లకు పెద్ద ఎత్తున రప్పించేందుకు చిత్ర బృందం ఈ వినూత్న మార్కెటింగ్ స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది. 1990 లో సాధారణంగా ఒక సినిమా టికెట్ ధర దాదాపు యాభై రూపాయల పరిధిలోనే ఉండేది. సరిగ్గా ఆనాటి జ్ఞాపకాలని , ఆనాటి 1990ల నాటి ధరలను గుర్తు చేస్తూ మేకర్స్ ఈ ప్రత్యేకమైన ప్రమోషనల్ ఆఫర్ని ప్రవేశపెట్టడం విశేషం. ఈ 50 రూపాయల ఆఫర్ని సొంతం చేసుకోవడం చాలా సులభం. ప్రేక్షకులు ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫారమ్ 'BookMyShow' యాప్లోకి వెళ్లి, తమకు నచ్చిన థియేటర్ సీట్లని సెలెక్ట్ చేసుకునే సమయంలో 'GOVERNOR90' అనే ప్రత్యేక కూపన్ కోడ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. సదరు కోడ్ అప్లై చేయగానే టికెట్ ధర యాభై రూపాయలుగా మారిపోతుంది. అయితే ఈ ఆఫర్ కేవలం మొదటి 25,000 టికెట్లకే మాత్రమే పరిమితం. కాబట్టి ఆఫర్ ముగిసేలోపు వీలైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలని చిత్ర నిర్మాణ సంస్థ సన్షైన్ పిక్చర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులని కోరుతుంది.
also read: Balakrishna: యూకేలో జై బాలయ్య' నామస్మరణ.. పేద విద్యార్థుల కోసం 10 లక్షల విరాళం
కేవలం టికెట్ ధరలు మాత్రమే కాదు, ఈ సినిమా కథా నేపథ్యం కూడా 1990ల నాటి కాలానికే చెందుతుంది. ఈ చిత్రం భారతదేశ ఆర్థిక చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన ఘట్టమైన 1991 నాటి తీవ్ర ఆర్థిక సంక్షోభం (ఫారెక్స్ క్రైసిస్) బ్యాక్డ్రాప్లో తెరకెక్కింది. ఆ సమయంలో దేశంలో ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు కేవలం కొన్ని వారాల దిగుమతులకు మాత్రమే సరిపోయేలా పడిపోయి, దేశం దివాలా తీసే ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆర్బీఐ గవర్నర్ ఎస్. వెంకటరమణన్ తన ధైర్యవంతమైన నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడారు, దేశాన్ని సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కించారు అనే యథార్థ గాథ ఆధారంగా ఈ ఎకనామిక్ థ్రిల్లర్ రూపొందింది. మనోజ్ బాజ్పాయ్ ఆర్బీఐ గవర్నర్ గా కనిపిస్తుండగా అదా శర్మ హీరోయిన్. చిన్మయ్ మాండ్లేకర్ దర్శకత్వంలో, విపుల్ అమృత్లాల్ షా నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి జావేద్ అఖ్తర్ పాటలు రాయగా, అమిత్ త్రివేది సంగీతాన్ని అందించారు.
![]() |
![]() |