Home  »  News  »  ఛాతిలోకి 7 బుల్లెట్లు.. ‘కాంతార’ హీరోయిన్‌ తండ్రి వీరగాథ!

Updated : Oct 7, 2025

అక్టోబర్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సంచలనం సృష్టిస్తున్న విభిన్న కథా చిత్రం ‘కాంతార చాప్టర్‌1’. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతున్న ఈ సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ సినిమాలో యువరాణి పాత్ర పోషించిన రుక్మిణీ వసంత్‌.. తన అందంతో అభినయంతో ఆకట్టుకుంటోంది. కన్నడలో రక్షిత్‌ శెట్టి హీరోగా రూపొందిన ‘సప్త సాగరదాచె ఎల్లో’ సిరీస్‌లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో విడుదలై తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ‘కాంతార చాప్టర్‌1’లోని యువరాణి పాత్రలో అందర్నీ మెప్పిస్తున్న రుక్మిణీ వసంత్‌ గురించి తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్స్‌ చేస్తున్నారు సినీ ప్రేమికులు. ఆమె గురించి, ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ గురించి తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఎవరీ రుక్మిణి వసంత్‌? ఆమె గురించి తెలుసుకొని అందరూ ఎందుకంత షాక్‌ అవుతున్నారు? అనే వివరాల్లోకి వెళితే..

1996 డిసెంబర్‌ 10న బెంగుళూరులో వసంత్‌ వేణుగోపాల్‌, సుభాషిణి వసంత్‌ దంపతులకు జన్మించారు రుక్మిణీ వసంత్‌. వసంత్‌ వేణుగోపాల్‌ భారత సైన్యంలో అధికారిగా పనిచేశారు. జమ్ము కాశ్మీర్‌, పఠాన్‌కోట్‌, సిక్కిం, బెంగళూరులలో తన సేవలందించారు. 2007లో ఊరి సెక్టర్‌ వద్ద పాక్‌ ఉగ్రవాదుల దాడిని ఎదుర్కొని వీరమరణం పొందారు. ఈ దాడిలో వసంత్‌ వేణుగోపాల్‌ ఛాతిలోకి 7 బుల్లెట్లు దూసుకుపోవడంతో ఆయన మరణించారు. దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన వసంత్‌ను అశోకచక్ర పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది. కర్ణాటక నుంచి ఈ పురస్కారాన్ని పొందిన తొలి వ్యక్తి వసంత్‌ వేణుగోపాల్‌. అలా 11 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయారు రుక్మిణీ వసంత్‌. తన జ్ఞాపకాల్లో తండ్రి ఎప్పటికీ జీవించే ఉంటారని చెబుతారామె. అందుకే ప్రతి సంవత్సరం తండ్రి జయంతి, వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. రుక్మిణి తల్లి భరతనాట్య కళాకారిణి. భర్త మరణం తర్వాత ‘వీర్‌ రత్న ఫౌండేషన్‌’ స్థాపించి తనలాంటి సైనిక భార్యలకు మద్దతుగా నిలబడుతున్నారు సుభాషిణీ వసంత్‌.  

ఇక రుక్మిణీ వసంత్‌ సినిమా కెరీర్‌ గురించి చెప్పాలంటే.. 2019లో కన్నడలో రూపొందిన ‘బీర్బల్‌ ట్రైలోజీ’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత ‘సప్త సాగరదాచె ఎల్లో’ చిత్రం హీరోయిన్‌గా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘సప్తసాగరాలు దాటి’ పేరుతో విడుదలైంది. 2024లో నిఖిల్‌ హీరోగా వచ్చిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇటీవల పాన్‌ ఇండియా మూవీ ‘మదరాసి’ చిత్రంలోనూ తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా రిషబ్‌శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ‘కాంతార చాప్టర్‌1’తో దేశవ్యాప్తంగా పాపులర్‌ అయ్యారు రుక్మిణి. ప్రస్తుతం ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌ రూపొందుతున్న ‘డ్రాగన్‌’లో, యశ్‌ హీరోగా రూపొందుతున్న ‘టాక్సిక్‌’ చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. హీరోయిన్‌గా అంచెలంచెలుగా ఎదుగుతున్న రుక్మిణీ వసంత్‌ త్వరలోనే స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌కి వెళ్లిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.