![]() |
![]() |
సాధారణంగా సినిమా సెలబ్రిటీల ఇళ్ళపై ఐటి అధికారులు దాడులు చేస్తారు. అత్యవసరంగా సోదాలు నిర్వహిస్తుంటారు. కానీ, దానికి భిన్నంగా ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల ఇళ్లలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా హీరోలుగా మంచి పేరు తెచ్చుకుంటున్న దుల్కర్ సల్మాన్, పృథ్విరాజ్ సుకుమారన్ నివాసాలకు కస్టమ్స్ అధికారులు చేరుకొని సోదాలు నిర్వహించడం ఇప్పుడు మాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. భూటాన్ నుంచి 100 కంటే ఎక్కువ లగ్జరీ వాహనాలను కొందరు అక్రమంగా దిగుమతి చేసుకున్నారనే సమాచారంతో కేరళలోని ప్రముఖ నటీనటులు, పారిశ్రామిక వేత్తలతోపాటు కొందరు ధనికుల ఇళ్ళల్లో, వారికి సంబంధించిన ఆఫీసులలో అధికారులు సోదాలు నిర్వహించారు. ‘ఆపరేషన్ నుమ్ ఖోర్’ పేరుతో జరుగుతున్న ఈ సోదాల్లో ఇద్దరు ప్రముఖ హీరోలు కూడా ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. భూటాన్ నుంచి తెప్పించిన కొత్త లగ్జరీ వాహనాలను సెకండ్ హ్యాండ్ వాహనాలుగా చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఆపరేషన్ నుమ్ఖోర్లో భాగంగా కొచ్చి, తిరువనంతపురం, మలప్పురం, కోజికోడ్, త్రిస్పూర్, కుట్టిపురం సహ దాదాపు 30 ప్రదేశాలలో కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొచ్చిలో ఉండే ప్రముఖ మలయాళ స్టార్స్ పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ ఇళ్లలో కూడా కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. చట్టం ప్రకారం సెకండ్ హ్యాండ్ వాహనాల దిగుమతిని నిషేధించారు. కానీ, ఆర్.టి.ఎ. వెబ్సైట్లో 10 నుండి 15 కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారుల దృష్టికి వచ్చింది. ఇవి భారతదేశంలో తయారు చేయలేదని తనిఖీల్లో గుర్తించారు. అక్రమంగా దిగుమతి చేసుకున్న ఈ వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. వాహనాలకు సంబంధించి సరైన డాక్యుమెంట్లు చూపించకపోతే నేరస్తులుగా పరిగణించబడతారని, శిక్షకు అర్హులు అవుతారని అధికారులు హెచ్చరిస్తున్నారు.
లంబోర్గిని కారును కొనుగోలు చేసి దాన్ని పుదుచ్చేరిలో రిజిష్టర్ చేయడం ద్వారా టాక్స్ ఎగ్గొట్టారనే ఆరోపణ పృథ్విరాజ్పై గతంలోనే ఉంది. దాంతో ఇప్పుడు బయటికి వచ్చిన భూటాన్ వాహనాల వ్యవహారంలో అతన్ని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన తనిఖీలకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని అధికారులు వెల్లడించలేదు. త్వరలోనే ఈ తనిఖీల తాలూకు పూర్తి వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.
![]() |
![]() |