Home  »  News  »  పెళ్లి ఎంత సహజమో.. విడాకులు కూడా అంతే సహజం.. ఇదీ సినిమా సెలబ్రిటీల పరిస్థితి!

Updated : Nov 22, 2024

భారతీయ వివాహ వ్యవస్థ ఎంతో బలమైనది, దృఢమైనది.. ఈ మాట అంటే.. అది ఒకప్పుడు అనే మాట వెంటనే వినిపిస్తుంది. ఎందుకంటే సుదీర్ఘమైన వైవాహిక జీవితాన్ని గడపడంలో, ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంలో నేటి యువతీయువకులు దారుణంగా విఫలమవుతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత సమాజంలో పెళ్లి చేసుకోవడం ఎంత సహజమో విడాకులు తీసుకోవడం కూడా అంతే సహజం అనే నానుడి ప్రచారంలోకి వచ్చేసింది. ఇది ధనిక వర్గాల్లో, ఉన్నతమైన ఉద్యోగాలు చేసేవారిలో, సినిమా రంగంలోని వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. దేశంలోని వివిధ కోర్టుల్లో విడాకులకు సంబంధించిన కేసులు అధికంగా నమోదై ఉన్నాయి. 

ఇదిలా ఉంటే.. సినీ పరిశ్రమలో ఈమధ్యకాలంలో విడాకులు తీసుకునేవారి సంఖ్య బాగా పెరిగింది. ఒకటి, రెండు సంవత్సరాల తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల విడాకులు తీసుకోవడం సహజం. కానీ, సంవత్సరాల తరబడి వైవాహిక బంధంలో ఉన్నవారు సైతం విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. భారతీయ వివాహ వ్యవస్థ ఎటువైపు పయనిస్తోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దానికి ఉదాహరణగా ఎ.ఆర్‌.రెహమాన్‌, సైరా బానుల గురించి చెప్పుకోవచ్చు. వీరి వివాహం జరిగి 29 సంవత్సరాలవుతోంది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాజాగా వీరిద్దరూ తమ వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్టు, చట్టపరంగా విడిపోతున్నట్టు ప్రకటించారు. అలాగే ఈ ఏడాది ఆరంభంలో ఎ.ఆర్‌.రెహమాన్‌ మేనల్లుడు జి.వి.ప్రకాష్‌కుమార్‌ కూడా తన భార్య సైంధవి నుంచి విడిపోతున్నట్టు తెలియజేశారు. 11 ఏళ్ళ వైవాహిక జీవితానికి ఈ జంట స్వస్తి పలికింది. ఇక తమిళ్‌ హీరో జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు. తమ మధ్య మనస్పర్థలు వచ్చిన తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నామని, మమ్మల్ని కలిపేందుకు పెద్దలు ప్రయత్నాలు చేశారని, అవి విఫలమైన తర్వాతే విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. వీరిద్దరూ 15 ఏళ్ళపాటు వైవాహిక జీవితాన్ని గడిపారు. జయం రవి ప్రకటనపై స్పందించిన ఆర్తి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రవి అలాంటి ప్రకటన చేశారని ఆరోపించారు. 

ఇక కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ మనవడు యువరాజ్‌కుమార్‌, శ్రీదేవి బైరప్ప వివాహం 2019లో జరిగింది. ఈ ఏడాది ఆరంభంలో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో ఇద్దరూ రచ్చకెక్కారు. తన భార్యకు ఒక పెళ్ళయిన యువకుడితో అక్రమ సంబంధం ఉందని రాజ్‌కుమార్‌, తన భర్తకు ఒక హీరోయిన్‌తో ఎఫైర్‌ ఉందని శ్రీదేవి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇది అప్పట్లో కన్నడ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది. సాధారణంగా సినీ ప్రముఖులు తాము విడిపోతున్నామని ప్రకటించినపుడు దాదాపుగా కారణాలు అనేవి బయటికి చెప్పరు. కానీ, ఈ జంట విషయంలో మాత్రం పెద్ద రచ్చే జరిగింది. ఇక మలయాళ నటి రేఖిత ఆర్‌.కురుప్‌(భామ) కూడా భర్త అరుణ్‌ జగదీష్‌ నుంచి విడాకులు తీసుకున్నారు. తెలుగులో మంచివాడు అనే సినిమాలో తనీష్‌కి జంటగా నటించారు భామ. 2020లో భామ, అరుణ్‌ వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. ఈ ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరూ విడిపోయారు.

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్‌ వివాహం హీరో ధనుష్‌తో 2004లో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. 18 సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో కొనసాగిన ఈ జంట 2022లో విడిపోతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ఇటీవల వ్యక్తిగతంగా కావాల్సిందిగా ఫ్యామిలీ కోర్టు కోరడంతో ఇద్దరూ విడాకులపై తమ అభిప్రాయాన్ని కోర్టుకు విన్నవించారు. తాము విడిపోవడానికే నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఈ కేసును ఈనెల 27కి వాయిదా వేసింది కోర్టు. ఆరోజున వీరిద్దరికీ విడాకులు మంజూరు అవుతాయని తెలుస్తోంది. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.