Home  »  News  »  ‘ఖాన్సార్‌ నగరం’ వీడియో రిలీజ్‌ చేసిన అభిమాని.. వైరల్‌ అవుతున్న వైనం!

Updated : Dec 27, 2023

ప్రపంచంలోని సినిమా లవర్స్‌ మధ్య ఒకటే చర్చ. అదే ‘సలార్‌’. సీజ్‌ఫైర్‌ పేరుతో ఫస్ట్‌ ఫార్ట్‌ విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్‌ డే అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది ‘సలార్‌’. ఇప్పటివరకు ప్రపచంవ్యాప్తంగా ‘సలార్‌’ రూ.500 కోట్లు కలెక్ట్‌ చేసిందని అంచనా వేస్తున్నారు. అయితే అధికారికంగా హోంబలే ఫిలింస్‌ ఈ విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది. ఈమధ్యకాలంలో ఏ సినిమాకీ లేని విధంగా ‘సలార్‌’కి రిపీటెడ్‌ ఆడియన్స్‌ రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాని రెండుసార్లు చూస్తే తప్ప అర్థం కాదన్న వాదన కూడా ఓపక్క వినిపిస్తోంది. దానివల్ల కూడా రిపీటెడ్‌ ఆడియన్స్‌ సంఖ్య బాగా పెరిగింది. సినిమా కథలోని కొన్ని అంశాలు ప్రేక్షకులకు అంతు చిక్కని ప్రశ్నలుగా మిగిలాయన్నది వాస్తవం. అందుకే ఓ అభిమాని సినిమాకి మెయిన్‌ ప్లాట్‌ అయిన ఖాన్సార్‌ ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను వివరిస్తూ ఓ వీడియో చేశాడు. ఈ వీడియోను హోంబలే ఫిలింస్‌ తమ అధికారిక యూ ట్యూబ్‌ ఛానల్‌లో షేర్‌ చేసింది. 

ఖాన్సార్‌ నగరంలో అతి కిరాతకమైన బంధిపోట్లు మన్నార్సీ, శౌర్యాంగ, ఘనియార్‌ అనే మూడు తెగలకు చెందినవారుగా ఉన్నారు.  ఈ మూడు తెగలు కలిసి వారికంటూ సొంతంగా ఒక నగరాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. దాని పేరే ఖాన్సార్‌ నగరం. సక్రమమైన పాలన కోసం ‘నిబంధన’ అనే పుస్తకాన్ని అనుసరిస్తారు. అందులో అన్ని నియమాలు ఉంటాయి. దాని ప్రకారమే ఖాన్సార్‌లో పాలన జరుగుతుంది. ఈ ఖాన్సార్‌ నగరాన్ని పాలించే వ్యక్తిని కర్త అంటారు. అతనికి కింద 8 మంది దొరలు, 61 మంది కాపరులు ఉంటారు. 40 ఏళ్లకు ఒకసారి ఖాన్సార్‌ నగరంలో అధికారం ఒక తెగ నుంచి మరో తెగకు మారుతుంది.

ఖాన్సార్‌ నగరాన్ని మొదట పాలించింది శివమన్నార్‌. ఈ కర్త మరణం తర్వాత ఖాన్సార్‌ పాలనాధికారం శౌర్యాంగ తెగకు వెళ్లాలి. కానీ, శివమన్నార్‌ కుమారుడు రాజమన్నార్‌(జగపతిబాబు) అలా జరగనివ్వలేదు. శౌర్యాంగ తెగ పెద్ద ధారాను చంపేశాడు. అంతేకాకుండా ఆ శౌర్యాంగ తెగలో ఎవరినీ వదలకుండా మట్టుబెట్టాడు. ఆ తర్వాత ఖాన్సార్‌ పాలన మన్నార్సీ, ఘనియార్‌ తెగలు మాత్రమే చేశాయి. రాజమన్నార్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు రాధారమ, రుద్ర రాజమన్నార్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండో భార్యకు వరద రాజమన్నార్‌, బాచీ రాజమన్నార్‌ అనే ఇద్దరు కొడుకులున్నారు. మొదటి భార్య పిల్లలు, మొదటి భార్య తమ్ముడికి సభలో దొరల హోదాని కల్పిస్తాడు కర్త. ఆ తర్వాత మిగిలిన ఐదుగురు దొరలు ఘనియార్‌ తెగకు చెందిన వారినే నియమిస్తారు. వారిలో నారంగ్‌, వాలి, రంగా, గురుంగ్‌, చీకా అనే ఐదుగురు దొరలుగా ఉన్నారు. వారిలో సీజ్‌ ఫైర్‌ భాగంలో నారంగ్‌, అతని కుమారుడు విష్ణు, రంగా చనిపోతారు. కర్త రాజమన్నార్‌ రెండో భార్య కుమారుడు వరద కేవలం కాపరిగానే ఉంటాడు.

వీళ్లకు ఓటు హక్కు కూడా ఉంటుంది. కర్తకు 15 ఓట్లు, మొదటి భార్య తమ్ముడు ఓమ్‌కి 4 ఓట్లు, మిగిలిన దొరలకు తలో 3 ఓట్లు ఉంటాయి. మిగిలిన కాపరులకు ఒకటి చొప్పున ఓటు ఉంటుంది. మొత్తం ఖాన్సార్‌ నగరంలో 101 ఓట్లు ఉంటాయి. కర్తలేని సమయంలో వరద రాజమన్నార్‌ ప్రాణాలు కాపాడేందుకు రాధారమ సీజ్‌ ఫైర్‌ని ఆజ్ఞాపిస్తుంది. సీజ్‌ఫైర్‌ అంటే ఖాన్సార్‌లో ఒకరిపై మరొకరు దాడి చేయడానికి వీల్లేనిది. కానీ, రుద్ర రాజమన్నార్‌ నిబంధనలో ఉన్న క్లాజ్‌తో సీజ్‌ఫైర్‌ ఎత్తేయడానికి ఓటింగికి వెళ్తాడు. ఆ సీజ్‌ ఫైర్‌ ఓటింగ్‌కి వెళ్లే సమయంలో జరిగిందే సలార్‌ సినిమా కథ. అలాగే సీజ్‌ ఫైర్‌ ఎత్తేసిన రాత్రి జరిగిన ఘటనలు సలార్‌ రెండో పార్ట్‌ శౌర్యాంగ పర్వం మూవీకి టీజర్‌ లాంటిది. అదిరిపోయే ట్విస్ట్‌ తో సలార్‌ సినిమా సీజ్‌ ఫైర్‌ ని ముగించి.. శౌర్యాంగ పర్వంపై భారీ అంచనాలను రేకెత్తించారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.