Home  »  News  »  మీరంతా బావుండాలి.. టీఎఫ్‌జేఏ ఈవెంట్‌లో రష్మిక ఆకాంక్ష!

Updated : Jul 18, 2023

 

"ఒక యూనియన్ సినిమా ఇండస్ట్రీలోని అందరి క్షేమం కోసం ఆలోచించడం చూస్తే సంతోషంగా ఉంది. మామూలుగా మా సినిమాలకు సంబంధించిన ఏ ఫంక్షన్ జరిగినా మీ జర్నలిస్టులంతా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు పిలవగానే నేను రావడం హ్యాపీగా ఉంది. మీరంతా బావుండాలి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్యూ. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది. ఇకపై కలుస్తూనే ఉంటా.." అన్నారు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రష్మికా మందన్నా. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్, ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు రష్మిక ముఖ్య అతిథిగా హాజరై ఫిల్మ్ జర్నలిస్టులకు 2023-24 సంవత్సరానికి కార్డులను అందజేశారు.

ఇదే కార్యక్రమంలో గౌరవ అతిథులుగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రసాద్, షైన్ స్క్రీన్స్ అధినేతల్లో ఒకరైన సాహు గారపాటి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్.పి  ఏసియన్ సినిమాస్ సిఎమ్ఓ జాన్వీ నారంగ్ హాజరయ్యారు. 

టిఎఫ్‌జేఏ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. "మొదట మేం అడగ్గానే మాకు సహాయ సహకారాలు అందించిన దిల్ రాజు గారికి కృతజ్ఞతలు. ఆ సంవత్సరం ఆయన మాకు ఇన్సూరెన్స్ కు అవసరమైన మొత్తాన్ని ఇచ్చి అండగా నిలబడ్డారు. అలాగే పెద్ద సంస్థలు అన్నీ కూడా ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కొక్కళ్లు చేస్తే బావుంటుంది అని ఆయనే సలహా ఇచ్చారు. ఐదేళ్లుగా హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నాం. ఇందుకోసం మేం అడగ్గానే దర్శకులు, నిర్మాతలు అందరూ సహకరిస్తున్నారు. మేం చేస్తోన్న ఈ కార్యక్రమాలూ, ఇన్సూరెన్స్ గురించి తెలిసి చిరంజీవి గారు అడగకుండానే మాకు సాయం చేశారు. కరోనా టైమ్ లో బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 60 మందికి మొదటి సారి నెలవారీ సరుకులు అందచేశాం. ఇలా చాలామందికి మా సంఘం ద్వారా సాయం చేశాం. వీటితో పాటు భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. ఇక ఈ యేడాదికి సంబంధించి విశ్వప్రసాద్ గారు, మైత్రీ మూవీ మేకర్స్ వారు, సాహు గారపాటి గారు, ఏషియన్ సునీల్ నారంగ్ గారిని ఇన్సూరెన్స్ గురించి సంప్రదించగానే వెంటనే స్పందించి సాయం అందించారు. ఇలాంటి కార్యక్రమానికి రష్మిక గారు రావడం ఆనందంగా ఉంది." అన్నారు.

టిఎఫ్‌జేఏ ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు మాట్లాడుతూ.. "విశ్వ ప్రసాద్ గారికి, నవీన్ గారికి, సాహు గారికి, జాన్వీ గారికి థ్యాంక్యూ. మనం అడిగిన వెంటనే స్పందించడానికి, పిలవగానే వారు రావడానికి కారణం.. మన అసోసియేషన్ కు ఉన్న గుడ్ విల్. మన జర్నలిస్ట్ లకు వాళ్లు అంత సాయం చేస్తున్నప్పుడు.. వారికి సమస్యలు వచ్చినప్పుడు జర్నలిస్ట్ లుగా మనం చేయాలని అని చర్చించడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఎక్కువ నాన్సెస్ జరుగుతోంది. వీటిలో ఎక్కువగా ఇబ్బంది పడేది సెలబ్రిటీసే. హీరోలు, హీరోయిన్లపై ఏది పడితే అది రాస్తున్నారు. అలాంటప్పుడు వాళ్లు ఒంటరిగా ఫైట్ చేయలేరు. సినిమాలు, షూటింగ్స్ ఉంటాయి. అలాంటప్పుడు మా అసోసియేషన్ తరఫున మే అండగా ఉంటాం అని చెప్పడం జరిగింది. ఇకపై ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ కు వచ్చే సమస్యలు తీరేవరకూ మేం ఫైట్ చేస్తాం. ఈ ఆలోచన చెప్పగానే చిరంజీవి గారు, దిల్ రాజు గారు అద్భుతమైన ఐడియా అని మెచ్చుకున్నారు. ఇక టిఎఫ్‌జేఏ అసోసియేషన్ కోసం మూడు రకాల ఇన్సూరెన్స్ లు చేశాం. ఒకటి నలుగురు కుటుంబ సభ్యులున్న ఫ్యామిలీకి 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్. మిగతావి టర్మ్ పాలసీ, యాక్సిడెంటల్ పాలసీ. ఈ మూడు ఇన్సూరెన్స్ ల కోసం చాలా పెద్ద కంపెనీలను సంప్రదించాం. వారిలో మనకు నచ్చేలా యతిక ఇన్సూరెన్స్ వాళ్లు ముందుకు వచ్చారు. మనం ఇప్పటి వరకూ కోటి పది లక్షలు ఇన్సూరెన్స్ కట్టాం. మనం క్లెయిమ్ చేసింది 90 లక్షలకు పైనే ఉంటుంది. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించబోతోన్న మన టిఎఫ్‌జేఏకు మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ.. థ్యాంక్యూ.." అన్నారు. 

యతిక ఇన్సూరెన్స్ ప్రతినిధి శివ మాట్లాడుతూ.. "టిఎఫ్‌జేఏతో మా అసోసియేషన్ ఐదేళ్లుగా కొనసాగుతోంది. ఈ ఐదేళ్లలో 96 హాస్పిటల్ క్లెయిమ్స్ చేశాం. 2 డెత్ క్లెయిమ్స్, ఒక యాక్సిడెంటల్ క్లెయిమ్స్ చేశాం. ఇందుకోసం 90 లక్షలకు పైగా ఇచ్చాం. టిఎఫ్‌జేఏ వారితో మా అనుబంధం ఇలాగే కొనసాగాలి. ఎవరికీ ఏ ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్నాం.. ఒక వేళ వచ్చినా 24 గంటలూ మేం అందుబాటులో ఉంటాం అని ప్రామిస్ చేస్తున్నా.." అన్నారు. 

టిఎఫ్‌జేఏ ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్ మాట్లాడుతూ.. "టిఎఫ్‌జేఏ నుంచి ఇప్పటి వరకూ ఈ ఐదేళ్లలో మనం ఇన్సూరెన్స్ సంస్థకు కట్టిన డబ్బులు 1 కోటి 10 లక్షలు 84వేల 626 రూపాయలు. ఈ మొత్తంలో మనం చేసుకున్న క్లెయిమ్ చేసుకున్న అమౌంట్ 90 లక్షల 76 వేల 614 రూపాయలు. ఈ మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి 60 లక్షల 26 వేల 614 రూపాయలు క్లెయిమ్ చేశాం. టర్మ్ ఇన్సూరెన్స్ 30 లక్షలు క్లెయిమ్ చేశాం. ఈ రెండూ డెత్ క్లెయిమ్స్. ఒకటి బిఏ రాజుగారు, మరోటి ట్రేడ్‌గైడ్ లక్ష్మీనారాయణ గారు. పర్సనల్ యాక్సిడెంటల్ 50వేలు క్లెయిమ్ చేశాం. అందరికీ ఏ ప్రాబ్లమ్ రాకూడదు. సంతోషంగా ఉండాలనే కోరుకుందాం. కానీ ఏదైనా అనుకోని సమస్య వచ్చినప్పుడు 24 గంటలూ ఎంతో మద్ధతుగా నిలుస్తున్నాం" అన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ లో నిర్మాతల్లో ఒకరైన నవీన్ యొర్నేని మాట్లాడుతూ.. "మేం సినిమాలు తీసిన తర్వాత వాటిని జనాల్లోకి తీసుకువెళ్లేది జర్నలిస్ట్ లే. ఆ విషయంలో మీరెప్పుడూ మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో.. మా వైపు నుంచి వారికి ఏ సహాయం కావాలన్నా ఉంటాం. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ పెద్దగా మారి అందరికీ హెల్ప్ కావాలని కోరుకుంటున్నా" అన్నారు. 

నిర్మాత టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. "మా సినిమాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్న జర్నలిస్ట్ లందరికీ థ్యాంక్యూ. టిఎఫ్‌జేఏ నుంచి ఇది గొప్ప నిర్ణయంగా భావిస్తున్నాను. టిఎఫ్‌జేఏ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సపోర్ట్ గా ఉంటుందని తెలియజేస్తున్నాను." అన్నారు. 

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్.పి, ఏసియన్ సినిమాస్ సిఎమ్ఓ జాన్వీ నారంగ్ మాట్లాడుతూ.. "టిఎఫ్‌జేఏకి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది." అన్నారు.

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. "టిఎఫ్‌జేఏ మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తుందనీ.. సభ్యులందరికీ మరిన్ని ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తుందని ఆశిస్తూ.. మంచి పనులు చేస్తున్న అసోసియేషన్ వారికి ఆల్ ద బెస్ట్." అన్నారు. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.