![]() |
![]() |

నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 సీజన్ చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్కే తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు, బాలయ్య అల్లుడు, కాబోయే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్న నారా లోకేష్ని కూడా ఆ షోకి బాలయ్య అతిథులుగా పిలిచారు. ఇక తాజాగా ఈ షోకి అతిథిగా పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీని షూటింగ్ కూడా జరిగింది.
ఆహా వేదికలో పవన్, బాలయ్య నడుమ రాజకీయాలపై చర్చ సాగింది. టిడిపితో పొత్తుపై పవన్ అభిప్రాయాన్ని బాలయ్య ప్రశ్నించారు. 2014లో టిడిపి, జనసేన పొత్తు మరలా ఎందుకు రిపీట్ కాకూడదు? అని ఎన్బీకే సూటిగా ప్రశ్నించారని తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా తనకు తాను ముందే ప్రకటించుకుంటే ఇక పొత్తులు ఎలా సాధ్యమంటూ అడిగినట్లు సమాచారం. ఇలా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలతో అన్స్టాపబుల్ షోని బాలయ్య రక్తికట్టించారని అంటున్నారు. ఒకానొక సందర్భంలో ప్రతిపక్ష ఓట్లు చీలకుండా చేస్తానన్న పవన్ కళ్యాణ్ మాటల ఆంతర్యం ఏమిటి? అంటూ బాలయ్య ప్రశ్నించారని కథనాలు వస్తున్నాయి.
చిరంజీవి- నాగబాబు- పవన్ మధ్య నిజంగా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయా అనే విషయమై కూడా బాలయ్య నేరుగా పవన్ని ప్రశ్నించారట. లోకానికి తెలపని పవన్ వ్యక్తిగత జీవితంపైన బాలయ్య ప్రశ్నలు వేశారని అంటున్నారు. మొత్తానికి ఆహా అన్స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్-బాలకృష్ణ ఎపిసోడ్ సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఈ షో రాజకీయంగా కూడా రచ్చ రచ్చ చేయడం ఖాయం. బాలయ్య అభిమానులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అభిమానుల వీరంగం ఒక లెవెల్ లో ఉంటుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా పొత్తుల గురించి పబ్లిక్ వేదికపై జనసేనానిని బాలయ్య నేరుగా ప్రశ్నించడం కాస్త రాజకీయంగా వేడిని పెంచుతోంది. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ టిఆర్పిలను ఓ రేంజ్ లో నమోదు చేస్తుందనేది తథ్యం.
![]() |
![]() |