![]() |
![]() |

మూడేళ్ల క్రితం మాట. విజయ్ దేవరకొండతో 'హీరో' టైటిల్తో మైత్రి మూవీ మేకర్స్ ఓ మూవీని స్టార్ట్ చేశారు. తమిళుడైన ఆనంద్ అన్నామలై దానికి దర్శకుడు. ఒక షెడ్యూల్ షూటింగ్ చేశాక, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కారణం.. ఆ షెడ్యూల్లో తీసిన సీన్లు నిర్మాతలకు నచ్చకపోవడం. అప్పటికే ఆ సినిమా కోసం కోట్లు ఖర్చుపెట్టారు.
ఇప్పుడు అదే నిర్మాతలు విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' మూవీని నిర్మిస్తున్నారు. అయితే మరోసారి విజయ్, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ మూవీ ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. 'ఖుషి'లో సమంత నాయికగా నటిస్తోంది. ఇటీవల ఆమె తన ఆరోగ్య స్థితి గురించి సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో అనుకున్న షెడ్యూల్ ప్రకారం 'ఖుషి' విడుదలవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రీట్మెంట్ తర్వాత ఎప్పుడు సమంత షూటింగ్కు అటెండ్ అవుతుందనే విషయంలో నిర్మాతలకు క్లారిటీ లేదు. ఆమె అందుబాటులోకి వచ్చే సమయానికి విజయ్ కాల్షీట్లు అందుబాటులో ఉంటాయా, లేదా అనేది ప్రశ్న. అతను కూడా అందుకు అనుగుణంగా తన కాల్షీట్లను అడ్జెస్ట్ చేయవలసి ఉంటుంది. ఫలితంగా 'ఖుషి' మూవీ మేకింగ్లో జాప్యం జరగవచ్చు. ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగి, నిర్మాతలపై అదనపు భారం పడుతుంది.
'లైగర్' డిజాస్టర్ రిజల్ట్ తర్వాత విజయ్ దేవరకొండ 'ఖుషి' మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో సమంత ఆరోగ్యం త్వరగా కుదుటపడి, ఆమె సెట్స్ మీదకు రావాలని నిర్మాతలు కోరుకుంటున్నారు.
![]() |
![]() |