![]() |
![]() |

కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ కి కర్ణాటక అత్యున్నత పురస్కారం 'కర్ణాటక రత్న'ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 1న కన్నడ రాజ్యోత్సవ పేరుతో జరగనున్న ఈ అవార్డు ప్రదానోత్సవ వేడుకకు టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హాజరు కానున్నారు.
కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకు పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. కన్నడ వారికి సుపరిచితుడు ఎన్టీఆర్ ని ఆహ్వానించగా, ఆయన వేడుకకు రావడానికి అంగీకరించారని అన్నారు. అలాగే రజినీకాంత్ కి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర కంబారకి కూడా ఆహ్వానం పంపినట్టు చెప్పారు. రాజ్ కుమార్ కుటుంబం సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
కర్ణాటకతో, పునీత్ కుటుంబంతో ఎన్టీఆర్ కి ఎంతో అనుబంధం ఉంది. ఆయన తల్లిది కర్ణాటకనే. ఇక పునీత్ తో సోదరుడిలా ఉండేవాడు తారక్. పునీత్ నటించిన 'చక్రవ్యూహ' చిత్రంలో ఎన్టీఆర్ ఒక పాట కూడా పడటం విశేషం.
![]() |
![]() |