![]() |
![]() |

తమిళ్ మూవీ 'వినోదయ సీతం' తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించనున్నారని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయిందని, పవన్ 20 రోజుల కాల్షీట్స్ కూడా ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాలని పవర్ స్టార్ నిర్ణయించుకున్నట్లు న్యూస్ వినిపిస్తోంది.
నటుడిగా, దర్శకుడిగా ఎన్నో విజయాలను అందుకున్న సముద్రఖని గతేడాది 'వినోదయ సీతం' అనే తమిళ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా మెప్పించారు. సముద్రఖని దర్శకత్వంలోనే తెరకెక్కనున్న ఈ మూవీ తెలుగు రీమేక్ లో పవన్, సాయి ధరమ్ నటిస్తారని వార్తలొచ్చాయి. సముద్రఖని సైతం తాను పవన్ ని డైరెక్ట్ చేయబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరోవైపు ఈ రీమేక్ స్క్రిప్ట్ బాధ్యతలు త్రివిక్రమ్ తీసుకున్నారని, సైలెంట్ గా పూజా కార్యక్రమాలతో మూవీ లాంచ్ కూడా చేశారని న్యూస్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై పవన్ ఆసక్తి చూపించట్లేదని, ముందుగా కమిట్ అయిన ప్రాజెక్ట్ లనే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్.
పవన్ ఎప్పుడో క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు', హరీష్ శంకర్ డైరెక్షన్ లో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమాలు కమిట్ అయ్యాడు. అయితే అనూహ్యంగా మధ్యలో రీమేక్ ఫిల్మ్ 'భీమ్లా నాయక్' చేసి రిలీజ్ చేశాడు. ఇప్పటికే 'హరి హర వీరమల్లు' సగం షూటింగ్ పూర్తయింది, ఆ ప్రాజెక్ట్ తర్వాత 'భవదీయుడు భగత్ సింగ్'తో బిజీ కానున్నాడు అనుకున్న సమయంలో సడెన్ గా 'వినోదయ సీతం' రీమేక్ తెరపైకి వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ సైతం నిరాశ చెందారు. రీమేక్ లను పక్కన పెట్టి 'హరి హర వీరమల్లు'ను పూర్తి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పవన్ కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్న పవన్ వీలైనంత త్వరగా 'హరి హర వీరమల్లు', 'భవదీయుడు భగత్ సింగ్' చిత్రాలను పూర్తి చేసి, ఎన్నికలకు సన్నద్ధం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో 'వినోదయ సీతం' రీమేక్ కి బ్రేక్ పడిందని ప్రచారం జరుగుతోంది.
![]() |
![]() |