![]() |
![]() |

'రుద్రమదేవి'(2015), 'గౌతమిపుత్ర శాతకర్ణి'(2017) చిత్రాల నిర్మాతలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. పన్ను రాయితీ తీసుకొని టికెట్ ధరలు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి.
చారిత్రాత్మక చిత్రాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను రాయితీ ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే 'రుద్రమదేవి', 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాలకు కూడా పన్ను రాయితీ లభించింది. అయితే నిర్మాతలు టికెట్ ధరలు తగ్గించి, ఆ పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు బదలాయించలేదంటూ వినియోగదారుల సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాయితీ పొందిన డబ్బుని తిరిగి ప్రభుత్వం రికవరీ చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో కోరింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం నిర్మాతలతో పాటు ప్రతివాదులైన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేసింది.
బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించగా.. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన 'రుద్రమదేవి' సినిమాకి గుణశేఖర్ దర్శకనిర్మాత కావడం విశేషం.
![]() |
![]() |