![]() |
![]() |

కమ్మ, కాపు సామాజికవర్గాలను దూషిస్తూ 'మాచర్ల నియోజకవర్గం' సినిమా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి(ఎస్.ఆర్.శేఖర్) గతంలో ట్వీట్స్ చేశాడంటూ కొన్ని స్క్రీన్ షాట్స్ ట్విట్టర్ లో వైరల్ గా మారాయి. దీంతో శేఖర్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్ట్ 12న విడుదలకు సిద్ధమవుతున్న 'మాచర్ల నియోజకవర్గం' కలెక్షన్స్ పై ఈ ట్వీట్స్ తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవి ఫేక్ ట్వీట్స్ అని, ఎవరో దురుద్దేశంతో ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని శేఖర్ చెప్పినా విమర్శలు ఆగట్లేదు. మాచర్ల నియోజకవర్గం సినిమాని బ్యాన్ చేయాలంటూ (#BanMacherlaNiyojakavargam) ట్విట్టర్ లో ట్రెండ్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో శేఖర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కొందరు ఫేక్ ట్వీట్స్ తో తాను కమ్మ, కాపు కులాలను కించ పరిచినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు శేఖర్. 'మాచర్ల ముచ్చట్లు' పేరుతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాగే తాను తెరకెక్కించిన సినిమాను బ్యాన్ చేయాలంటూ కాంపెయిన్ చేస్తున్నారని పేర్కొన్నాడు. తన కెరీర్ కి, సినిమాకి నష్టం కలిగేలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శేఖర్ కోరాడు. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

![]() |
![]() |